సోదరితో గొడవ, నచ్చిన టీవీ ఛానల్ పెట్టలేదని బాలిక ఆత్మహత్య
అదిలాబాద్: టీవీ ఛానల్ విషయంలో అక్కా చెల్లెళ్ల మధ్య గొడవ జరిగింది. తండ్రి మందలించాడు. దీంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లాలోని కోమటిగూడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
జ్యోతి అనే పదమూడేళ్ల బాలిక మంగళవారం నాడు రాత్రి తెలుగు ఛానల్ పెట్టాలని కోరింది. మహారాష్ట్ర నుంచి పుట్టింటికి వచ్చిన జ్యోతి సోదరి హిందీ ఛానల్ కోసం పట్టుబట్టింది. ఈ విషయంలో జ్యోతికి సోదరితో వాగ్వాదం జరిగింది.
జ్యోతి పైన సోదరి చేయి చేసుకుంది. తండ్రి జోక్యం చేసుకొని చిన్న కుమార్తె అయిన జ్యోతిని మందలించాడు. మనస్తాపం చెందిన జ్యోతి రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో మృతి చెందింది.
భార్యపై భర్త దాడి
కుటుంబ తగాదాలతో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక అశోక్ రోడ్డులో నివాసం ఉంటున్న సింగరేణి విశ్రాంత కార్మికుడు లగిశెట్టి గురువయ్యకు భార్య లక్ష్మితో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో గొడవకు దిగిన గురువయ్య కోపంతో భార్యపై దాడి చేశాడు. రెండు చేతులకు తీవ్రగాయాలైన ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు గురువయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.