రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు: చర్లపల్లి జైలుకు తరలింపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు.. రేవంత్ రెడ్డిని, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిని విచారించారు.
కేటీఆర్ ఫాంహౌస్ వివాదం: ఎయిర్పోర్టులో రేవంత్ రెడ్డి అరెస్ట్
14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు
అనంతరం రేవంత్ రెడ్డిని గురువారం సాయంత్రం ఉప్పరపల్లి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు 14 రోజల రిమాండ్ విధించింది. దీంతో రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ల వాడకం..
అంతకుముందు పరిణామాలను గమనించినట్లయితే.. రేవంత్ రెడ్డితోపాటు మరో ఐదుగురుని కూడా అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. లోక్ సభ సమావేశాలకు హాజరై ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించిన నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి అనుచరులు, అభిమానులు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డితోపాటు కొండల్ రెడ్డిపై ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. సెక్షన్ 184, సెక్షన్ 187 కింద కేసులు నమోదు చేశారు. మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పరపల్లి న్యాయస్థానానికి తరలించారు.
కల్వకుంట్ల రాజ్యం.. నియంత పాలన అంటూ కాంగ్రెస్ నేతలు
కాగా, రేవంత్ రెడ్డి అరెస్టును కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఒక ఎంపీని ఇస్తానుసారంగా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని.. ఇలాగే ఈ దుర్మార్గపాలన కొనసాగితే ఎవ్వరు మాట్లాడలేరని అన్నారు.
కల్వకుంట్ల అప్రజాస్వామిక పాలనపై కలిసి కట్టుగా ఉద్యమించాలన్నారు.