బీజేపీది అవినీతి రహిత పాలన, వేల గ్రామాలకు విద్యుత్: కేంద్రమంత్రి పురుషోత్తమ్
ప్రధాని మోడీ మూడేళ్ల పాలనలో అవినీతి అక్రమాలు లేకుండా సుపరిపాలన అందించారని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల వెల్లడించారు.
పెద్దపల్లి: ప్రధాని మోడీ మూడేళ్ల పాలనలో అవినీతి అక్రమాలు లేకుండా సుపరిపాలన అందించారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడించారు. పెద్దపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పారు. మోడీ పేద వర్గాల సంక్షేమం, అబివృద్ధి కోసం 106 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి రూ.80 లక్షల చొప్పున ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. 12 జాతీయ రహదారులకు రూ.48 వేల కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. 15వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందించడం జరిగిందని చెప్పారు.

రూ.12 వేల కోట్లతో 11 భారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొన్ని సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా కూడా ఉందన్నారు. 33 శాతం పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా పథకం ద్వారా ఒక్కటిన్నర రెట్లు పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందని బీజేపీ శాసనసభ పక్షనేత జి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండలో పార్టీ విస్తారక్ యోజనలో భాగంగా పోలింగ్ బూత్ సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు కుటుంబ పరిపాలనకు చరమగీతం పాడుతున్నారని, అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తూ, హామీలు నెరవేర్చకుండా ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు కాలం చెల్లిందని చెప్పారు.
గోవధ నిషేధం చట్టవిరుద్ధం: చాడ
మంచిర్యాల: గోవధ నిషేధం చట్ట విరుద్ధమని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోతారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాలలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలనలో లక్ష మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం భూస్వామ్య విధానాన్ని అవలంభిస్తున్నారన్నారు.
మియాపూర్, ఇబ్రహీంపట్నంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వ భూమి రిజిస్ర్టేషన్ విషయంలో 72 మంది సబ్ రిజిస్ర్టార్లను బలి చేయడం సరికాదన్నారు. కేశవరావుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో జూన్ 15 నుంచి వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ సంఘాలతో కలిసి సమ్మెను చేపడుతామని, దీనిని విజయవంతం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications