17 ఏళ్ల వయసులోనే మహా ముదురు... ఒకరికి తెలియకుండా ఒకరితో... ముగ్గురిని మోసం చేసిన బాలుడు
అతని వయసు 17 సంవత్సరాలు... కానీ మహా ముదురు... ఒకరికి తెలియకుండా ఒకరితో... మొత్తం ముగ్గురితో సంబంధం పెట్టుకున్నాడు... మాయ మాటలతో ముగ్గురికీ శారీరకంగా దగ్గరయ్యాడు. ప్రేమ,పెళ్లి అంటూ వారిని మోసం చేశాడు.ఆ మాయగాడి వలలో పడిన మూడో బాలికకు అనుమానం రావడంతో ఇటీవల అతని ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో అతని అసలు స్వరూపం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు మొదట ఓ బాలిక(16)కు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. కొన్నాళ్లకు ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అతన్ని గట్టిగా మందలించగా... వారికి కొంత డబ్బు చెల్లించి బాలికతో తెగదెంపులు చేసుకున్నాడు.
ఆ తర్వాత 14 ఏళ్ల మరో బాలికకు ఇలాగే ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెతోనూ శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెతో సంబంధం కొనసాగిస్తూనే 17ఏళ్ల మరో బాలికను తన వలలో పడేశాడు. ఇలా ఒకేసారి ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన మూడో బాలిక ఇటీవల నేరుగా అతని ఇంటికి వెళ్లి నిలదీసింది. తనను మోసం చేశావని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతను నీళ్లు నమిలాడు. బాలిక కుటుంబ సభ్యులు అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమాయక ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ బాలుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు ఆ బాలుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.
Recommended Video
ఇలాంటి ఘటనే ఇటీవల ఏపీలోని కడప జిల్లాలోనూ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ,ఏపీలోని పలు ప్రాంతాల్లో దాదాపు 300 మంది మహిళలను మోసం చేసిన ప్రొద్దుటూరుకు చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి అలియాస్ ప్రశాంత్రెడ్డి , అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు,వివాహిత మహిళలకు వల వేసిన ప్రసన్న కుమార్ రెడ్డి... వారి నగ్న ఫోటోలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడు. వారిలో ఎంతోమందిని లోబరుచుకున్నాడు. చాలామంది నుంచి డబ్బులు గుంజాడు. అతని సెల్ఫోన్లో 300 మంది అమ్మాయిలు,వివాహితల అర్ధనగ్న చిత్రాలను పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.