ఎన్నికలకు ముందు షాక్: 180 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్, లక్షలాది మందిపై ప్రభావం
హైదరాబాద్: ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉన్నందున తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని 180కి పైగా ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఆసుపత్రులు వాటిని నిలిపేస్తున్నట్లు ప్రకటన చేశాయి.
తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.1200 బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించింది. ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం బకాయిలు ఇవ్వలేదని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం గమనార్హం. దీని వల్ల 84.5 కోట్ల మంది నిరుపేద కుటుంబాలు, 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు, జర్నలిస్టులపై ప్రభావం పడనుంది.
లక్షలాదిమందిపై ప్రభావం
రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పింఛన్దారులు, వేలాదిమంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఉన్నాయి. వీరు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ సేవలను బంద్ చేస్తున్నట్లు తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించడం గమనార్హం. దీంతో నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆ కార్డులు పని చేయవు.
దాదాపు ఏడాది బకాయిలు
ప్రతి ఆసుపత్రికి దాదాపు ఏడాది నుంచి బకాయిలు రావాల్సి ఉందని తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఏం చేయలేని పరిస్థితుల్లో తాము సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్.. ఇలా పలు సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
గతంలోనే హెచ్చరికలు
కాగా, ప్రయివేటు ఆసుపత్రులలో డిసెంబరు ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం సేవలు నిలిచిపోనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందిస్తున్నాయి. ఈ ఆసుపత్రులలో అన్ని రకాల సేవలూ నిలిచిపోనున్నాయి. తొలుత నవంబర్ 20వ తేదీ నుంచి ఓపీ, డయాగ్నస్టిక్ పరీక్షలను నిలిపివేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబరు 1 నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలోను సేవలు నిలిపివేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రకటన కూడా చేశారు.
అందుకే నిలిపివేత
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆసుపత్రులలో అందించే అన్ని రకాల సేవలకుగాను నెలకు రూ.120 కోట్లు వరకు అవుతోందని తెలుస్తోంది. దాదాపు సంవత్సరం బకాయిలు నిలిచిపోయాయని చెబుతున్నారు. రూ.1200 కోట్లు రావాలని, ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కనిపించనందునే సేవలు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. 2014-15లో బకాయిల కోసం సేవలు నిలిపివేసే సమయానికి ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు రావాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతూ రూ.1200 కోట్లకు చేరాయని చెబుతున్నారు. ఇప్పటి దాకా వైద్య మంత్రి విజ్ఞప్తి మేరకు ఆగుతూ వచ్చిన నెట్వర్క్ ఆసుపత్రులు ఇప్పుడు మాత్రం బకాయిలు రాబట్టుకోవడంపై కఠినంగానే ఉండాలని నిర్ణయించుకున్నాయి.