జూబ్లిహిల్స్లో 21 లక్షలు చోరీ: బైకుపై వచ్చి లాక్కుపోయారు
హైదరాబాద్: నగరంలో పోలీసులు దొంగతనాలను అరికట్టేందుకు కొత్త ప్రణాళికలను అమల్లోకి తెచ్చినా దొంగలు తమ పని తాము చేసుకోని వెళ్లిపోతున్నారు. ఇటీవల కాలంలో మరీ చైన్ స్నాచింగ్ ఎక్కువగా పెరిగింది. దీనిని అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.
అయితే మంగళవారం రాత్రి జరిగిన సంఘటనలో మాత్రం దొంగలు చైన్ స్నాచింగ్కు పాల్పడలేదు. రూ.21 లక్షలున్న బ్యాగును స్ధానికులు చూస్తుండగానే ఇద్దరు దొంగలు లాక్కెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో ఈ సంఘటన నిన్న జరిగింది.
ఈ హఠాత్ పరిణామంతో వెంటనే తేరుకుని దొంగల వాహనాన్ని బాధితులు వెంబడించినా ఫలితం లేకపోయింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని హాజిల్ మర్కెంటైల్ అనే ట్రేడింగ్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న డీఆర్కే శేఖర్ రూ.21.61 లక్షలను ఫిలింనగర్ రోడ్డు నంబర్-1లోని ఎస్ఎంఎస్ ఫార్మసీలో ఇచ్చి రావాల్సిందిగా డ్రైవర్ రమేష్, సంస్థలో పనిచేసే శ్రీనివాస్లకు ఇచ్చాడు.
బైకుపై డబ్బును తీసుకెళుతుండగా రోడ్డు నెంబర్ 45కి రాగానే పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగు లాక్కొని పారిపోయారు. ఆ షాక్ నుంచి తేరుకుని ఫిలింనగర్ చౌరస్తా వరకు వెంబడించినా దొంగలు దొరకలేదని బాధితులు తెలిపారు.
ఈ విషయాన్ని కంపెనీ నిర్వాహకులకు చెప్పామని, అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు చెప్పారు. దీంతో సంఘటనా స్ధలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.