తెలంగాణలో కొత్తగా 2047 కరోనా పాజిటివ్ కేసులు: బస్సు దిగిన కండక్టర్కు పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,883 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 2047 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 4057కి చేరింది. కరోనా బారి నుంచి శనివారం 2013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 1174 కేసులు నమోదు కావడం గమనార్హం.
ఇది ఇలావుండగా, చెన్నూరు బస్టాండ్లో చేసిన పరీక్షల్లో డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. హనుమకొండ డిపోకు చెందిన బస్సు ఆదివారం ఉదయం 11 గంటలకు చెన్నూరుకు వచ్చింది. ప్రయాణికులంతా బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చెన్నూరు బస్టాండ్లో కరోనా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒంట్లో నలతగా ఉండటంతో తనకు కరోనా పరీక్ష చేయమని మహిళా కండక్టర్ కోరారు. దీంతో ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వెంటనే బస్నును హనుకొండ డిపోకు ఖాళీగా పంపించారు. అప్పటికే ఆ బస్సులోని ప్రయాణికులు వెళ్లిపోవడంతో ఆందోళన నెలకొంది. వారిలో ఇంకెవరికైనా కరోనా ఉందా? సోకిందా? అనేది కలకలంగా మారింది.
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనావైరస్ సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీలో సభాపతి పోచారం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా, గత నవంబర్ 26న పోచారం శ్రీనివాస్ రెడ్డి తొలిసారి కరోనా బారినపడ్డారు.