తెలంగాణలో కొత్తగా 21 కరోనా కేసులు: వలస కార్మికుల భారీ ఆందోళన
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 20, జగిత్యాలలో 1 కరోనా కేసు నమోదైనట్లు తెలిపింది.
Recommended Video
1082కు పాజిటివ్ కేసులు
తాజాగా 21 కేసులతో తెలంగాణ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 508 ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 545గా ఉంది. ఆదివారం ఒక్కరోజే 46 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో మరణాల సంఖ్య 29కి చేరింది.
వనస్థలిపురంలో కరోనా కలకలం
కాగా, వనస్థలిపురం పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వనస్థలిపురంలో మొత్తం 8 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతు బజార్-సాహెబ్ నగర్ రోడ్డు, ఏ,బీ టైప్ కాలనీలు, ఎస్కేడీ నగర్, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. కాగా, ఈ ప్రాంతాల్లో మొత్తం 169 మంది కుటుంబాలు హోంక్వారంటైన్లు ఉన్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. నిబంధనలు పాటించి ప్రజలు సహకరించాలని కోరారు.
వలస కార్మికుల భారీ ఆందోళన..
ఇది ఇలావుండగా, నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకిల్లో నివసిస్తున్న వలస కూలీలు సొంత ప్రాంతాలకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు సుమారు 1000 మందికిపైగా టోలిచౌకి వంతెన వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. వలస కూలీల ఆకలి బాధలు తీర్చేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్తో చర్చించి టోలిచౌకి ప్రాంతంలో 5 అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూలీలు సమీపంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి తమ వివరాలు నమోదు చేసుకోవాలని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేసి ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని డీసీపీ చెప్పడంతో కూలీలు ఆందోళన విరమించారు.