తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా: 2వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు 50,998 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా. 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,01,161కి చేరింది.

జీహెచ్ఎంసీలో 46 కొత్త కేసులు
శనివారం కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1653కి చేరింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 46 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 2వేలకు చేరువలో కరోనా యాక్టివ్ కేసులు
152 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,97,515కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1993 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 795 మంది హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ ఇప్పటి వరకు 92,00,465 కరోనా నమూనాలను పరీక్షించారు.

దేశంలోనూ పెరుగుతున్న కేసులు, సగానికిపైగా మహారాష్ట్ర నుంచే
మరోవైపు భారతదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే సగానికిపైగా కరోనా కొత్త కేసులు ఉండటం గమనార్హం. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 8,64,368 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 25,320 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది.

దేశంలో 2 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో కరోనాతో 161 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,58,607కి చేరింది. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 16,637 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,09,89,897కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,544కి పెరిగింది. కాగా, ఒక్క మహారాష్ట్రంలోనే ఒక్కరోజు వ్యవధిలో 15,602 కరోనా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. 88 మంది కరోనాతో మరణించారు.












Click it and Unblock the Notifications