మృగంలా వేటాడాడు: పెళ్లయినా వదల్లేదు!, ఎర్రగడ్డలో పట్టపగలు నరికేశాడు..
తీవ్ర ఆగ్రహావేశంతో పక్కనే ఉన్న కొబ్బరి బొండాల దుకాణంలోని కత్తి తీసుకొచ్చి స్రవంతిపై దాడికి పాల్పడ్డాడు.
Recommended Video
హైదరాబాద్: తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో.. పెళ్లయిన తర్వాత కూడా ఆమెను ప్రశాంతంగా బతకనివ్వలేదు. నిత్యం వేధింపులు.. ఇంటి మీదకు వెళ్లి గొడవలు పెట్టుకున్నాడు. ఇల్లు మార్చినా, అతని తల్లిదండ్రులకు చెప్పినా లాభం లేకుండా పోయింది.
హైదరాబాద్లో దారుణం: యువతిపై ప్రేమోన్మాది దాడి..
రోజురోజుకు ఆమెపై వేధింపులు తీవ్రతరం చేస్తూ రావడంతో ఆమె వైవాహిక జీవితం ప్రమాదంలో పడింది. నిందితుడికి తల్లిదండ్రులకు అతని వేధింపుల గురించి చెప్పడంతో.. అతని పైశాచికత్వం మరింత కట్టలు తెంచుకుంది. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు.
హత్యా నేపథ్యం:
పోలీసుల కథనం ప్రకారం.. సనత్నగర్లోని సుభాష్నగర్కు చెందిన రాజలింగం, సుగుణల కుమార్తె స్రవంతి (26). అదే బస్తీకి చెందిన ఎలక్ట్రీషియన్ రవి(22) గత ఐదేళ్లుగా ఆమెను వేధిస్తున్నాడు. స్రవంతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు అతన్ని మందలించినా ప్రవర్తనలో మార్పు రాలేదు.
పెళ్లి తర్వాత కూడా
రవి వేధింపులు కొనసాగుతున్న క్రమంలోనే.. 2013లో హిమాయత్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ యాదగిరితో స్రవంతికి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే పెళ్లి తర్వాత కూడా రవి ఆమెను వేధించడం మానలేదు. ఆమె ఇంటికెళ్లి మరీ స్రవంతి భర్తతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు.
ఇల్లు మారినా:
రవి వేధింపులు తాళలేక స్రవంతి దంపతులు మూడు నెలల క్రితం ఇల్లు కూడా మారారు. అయినా రవి వేధింపులకు ఫుల్ స్టాప్ పడలేదు సరికదా.. మరింత రెచ్చిపోయాడు. దీంతో స్రవంతి రెండు సార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మందలింపులకూ రవి మారలేదు.
రవి తల్లిదండ్రులకే మొరపెట్టుకుని:
పోలీసులు చెప్పినా తనపై వేధింపులు ఆపకపోతుండటంతో స్రవంతి తీవ్ర ఆవేదనకు గురైంది. విషయం రవి తల్లిదండ్రులకే చెప్పి.. అతన్ని కట్టడి చేయాలని కోరాలనుకుంది. అనుకున్నట్టే.. సోమవారం రవి ఇంటికెళ్లి అతని తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించింది.
ఆ విషయం తెలిసి
స్రవంతి తమ ఇంటికొచ్చి విషయం చెప్పిందన్న సమాచారం రవికి అందడంతో.. అతను మరింత కోపోద్రిక్తుడయ్యాడు. స్రవంతి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఆమెను బైక్ పై వెంబడించాడు. భయపడిన స్రవంతి తన స్నేహితురాలైన సునీతకు ఫోన్ చేసి తక్షణం ఎర్రగడ్డకు రావాలని చెప్పింది.
కత్తితో విచక్షణారహితంగా
మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఎర్రగడ్డ టెలిఫోన్ ఎక్స్ఛ్ంజ్ వద్ద బైక్ పై స్రవంతిని అడ్డగించాడు. స్రవంతితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహావేశంతో పక్కనే ఉన్న కొబ్బరి బొండాల దుకాణంలోని కత్తి తీసుకొచ్చి స్రవంతిపై దాడికి పాల్పడ్డాడు. మెడ, చేతులు, కడుపు, వీపుపై విచక్షణారహితంగా నరికాడు. దాడిలో ఆమె చేతి వేలు తెగిపోయింది.
స్థానికుల దేహశుద్ది
గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో స్రవంతి కుప్పకూలింది. ఇది చూసిన ఆమె స్నేహితురాలు సునీత భయభ్రాంతులకు గురైంది. దాడిని గమనించిన స్థానికులు రవిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రురాలిని స్థానిక సెయింట్ థెరిసా ఆసుపత్రికి, ఆక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.