తెలంగాణలో కొత్తగా 2,447 కరోనా కేసులు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోనేందుకు సిద్ధమన్న హరీశ్
తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సంఖ్య భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,447 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో రాష్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22, 197కు చేరింది. ముగ్గురు మరణించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందించిన డాక్టర్లు, పోలీసులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

పెరుగుతున్న కేసులు..
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 80,138 శాంపిల్స్ నిర్వహించగా 2,447 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ఆదివారం 2,047 కేసులు నమోదు అయ్యాయి. నిన్న నమోదైన కేసులతో పోలిస్తే 400 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ ముగ్గురు మృతి చెందగా 2,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 7,11,656కు చేరింది. ఇప్పటి వరకు 4,060 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు వచ్చాయి.

గాంధీలో 120 మందికి కరోనా
గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. 120 మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. డాక్టర్లు, హౌస్ సర్జన్స్, ఎంబీబీఎస్ విద్యార్థులకు పాజిటివ్ గా నిర్థారణ అయింది. కరోనా మహమ్మారి సోకినవారిలో 38 మంది వైద్యులు 48 మంది పీజీ విద్యార్థులు, 35 మంది ఎం బి బి ఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ ఉన్నారు. దీంతో గాంధీలో మిగతా సిబ్బంది విధులు నిర్వహించాలంటే భయపడుతున్నారు.

మానసిక ఆస్పత్రిలో 66 మందికి పాజిటివ్
అటు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోనూ కరోనా వైరస్ బారిన పడ్డారు. మొత్తం 66 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. కరోనా బారిన పడ్డవారిలో 57 మంది పేషంట్లు, 9 మంది సిబ్బంది ఉన్నారు. లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందిస్తున్నట్లు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్ లో ఉంచినట్లు పేర్కొన్నారు.

పోలీస్శాఖలో కలవరం..
పోలీస్శాఖలోనూ ఈ వైరస్ కలవరపెడుతోంది. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 500 మందికిపైగా పోలీసులకు పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందించిన పోలీసులు కరోనా బారిన పడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్లో మొత్తం 12 మందికి కరోనా వైరస్ సోకింది. ఏసిపి, సిఐ, 10 కానిస్టేబుళ్లకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల, రాజేందర్నగర్, దుండిగల్, పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా బారిన పడ్డారు . అటు రాజేంద్రనగర్ పీఎస్లో ఏకంగా 16 మంది పోలీసులకు కరోనా సోకింది.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
రాష్ట్రంలో కరోనా తీవ్రత , కట్టడిపై సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన కేబినెట్లో చర్చించారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వివరించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5 కోట్ల డోసుల టీకాలు వేశామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ స్వచ్ఛంగా కరోనానిబంధనలు పాటిస్తే వైరస్ నియంత్రనలోకి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications