తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు: ఆ ఐదు జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 52,244 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 255 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు, ఒకరు మృతి
తాజాగా, నమోదైన 255 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,63,281కు చేరింది. కరోనాతో కొత్తగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3903కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1527 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 5148 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 329 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,54,230కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 09, జీహెచ్ఎంసీలో 70. జగిత్యాలలో 06, జనగామలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 01, కరీంనగర్లో 20, ఖమ్మంలో 22, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్నగర్లో 03, మహబూబాబాద్లో 02, మంచిర్యాలలో 08, మెదక్లో 01, మేడ్చల్ మల్కాజ్గిరిలో 14, ములుగులో 01, నాగర్ కర్నూలులో 03, నల్గొండలో 13, నారాయణపేటలో 00, నిర్మల్లో 00, నిజామాబాద్లో 03, పెద్దపల్లిలో 12, రాజన్న సిరిసిల్లలో 05, రంగారెడ్డిలో 16, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 08, సూర్యాపేటలో 07, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్లో 05, వరంగల్ అర్బన్లో 11, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాల్ పల్లి, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, నిర్మల్, వికారాబాద్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

ఉద్యమంలా వ్యాక్సినేషన్
ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో జూమ్ వీడీయో ద్వారా కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీకా పంపిణీ పై సమీక్షించారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో టీకా పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
మరోవైపు,బీఆర్కే భవన్లో ఉద్యోగుల కోసం చేపట్టిన రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ను శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్తో సహా సచివాలయ ఉద్యోగులకు జూన్ 11, 12 తేదీల్లో రెండురోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఏర్పాటు చేసి మొదటి విడత టీకాలు పంపిణీ చేశారు. ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీఏడీ జాయింట్ సెక్రెటరీ చిట్టిరాణి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications