సీఎంఓ నుంచి స్మిత సబర్వాల్ బదిలీ: తెలంగాణలో భారీగా ఐఎఎస్ల ట్రాన్స్ఫర్లు: ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తోన్నారు. మెరికల్లాంటి బ్యురోక్రాట్లను కీలక స్థానాల్లో నియమిస్తోన్నారు.
శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను సరిదిద్దుతున్నారు.

ఈ క్రమంలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి తెలంగాణలో. ఏకంగా 26 మంది ఐఎఎస్ అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ అధికారులు స్మిత సబర్వాల్, రాహుల్ బొజ్జా, అహ్మద్ నదీం, బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, క్రిస్టీనా జెడ్ ఛొంగ్తు, సందీప్ కుమార్ సుల్తానియా, డీ కృష్ణ భాస్కర్, జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎం రఘునందన్ రావు, బీ వెంకటేశంతో పాటు పలువురు అధికారులు బదిలీ అయ్యారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వహిస్తోన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిలీవ్ అయ్యారు. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీంను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా.. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎం రఘునందన్ రావు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్ను బదిలీ చేసింది ప్రభుత్వం. ఆమెను తెలంగాణ ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా రిలీవ్ అయ్యారు.
సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ శరత్.. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోన్న డీ దివ్య.. మున్సిపల్ శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు. అలాగే- ప్రజావాణి నోడల్ అధికారిగా ఆమె వ్యవహరించాల్సి ఉంటుంది. నల్లగొండ కలెక్టర్గా హరిచందన దాసరి బదిలీ అయ్యారు.
పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న భారతి హొళ్లికెరి ఆర్కియాలజీ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. మహబూబాబాద్ కలెక్టర్ కే శశాంక.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా నియమించారు. జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.. సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్వి బీఎం సంతోష్.. జోగుళాంబ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications