తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: 200కుపైగా హైదరాబాద్లోనే..
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 269 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ నుంచే 214 కేసులు నమోదు కావడం గమనార్హం.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5675కి చేరింది. బుధవారం కరోనాతో మరొకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 192కు చేరింది. బుధవారం 1096 కరోనా టెస్టులు చేయగా అందులో 269 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 827 మంది కరోనా నెగిటివ్ అని తేలింది. మొత్తం ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్టులు 45,911 అని తెలిపింది.
జీహెచ్ఎంసీలో 214 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 13, కరీంనగర్ లో 8, వరంగల్ అర్బన్లో 10, ములుగు, జనగామలో 5 చొప్పున, మెదక్, సంగారెడ్డిలో 3 చొప్పున, వనపర్తి, మేడ్చల్లో 2 చొప్పున, జయశంకర్, అసిఫాబాద్, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున గుర్తించారు.
ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్కరోజే 151 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2412 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
కాగా, గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, ,ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటివ్ మెడిసిన్(ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ(వరంగల్), రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్-ఆదిలాబాద్)లో కరోనా టెస్టులు చేస్తున్నారు.