పార్లమెంట్: కాంగ్రెస్ ఎంపీ గుత్తాతో సహా 27 మంది సభ్యులపై సస్పెన్షన్
హైదరాబాద్: లోక్సభలో సభా సాంప్రదాయాలను అడ్డుకుంటున్నారని 27 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెన్షన్ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 377 రూల్ ప్రకారం ఈ 29 మంది ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ విధించినట్లు స్పీకర్ ప్రకటించారు.
సోమవారం లోక్సభ ప్రారంభమైన అనంతరం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా సభ జరగక్కుండా ఆందోళనలు చేస్తున్న ఎంపీల పేర్లు చదివిన స్పీకర్, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా సరే సభలో గందరగోళం చోటుచేసుకుంది.
లలిత్ మోడీ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు.
ఎంపీలకు కేటాయించిన సీట్లలో కూర్చోని సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. దీంతో స్పీకర్ ఆందోళన చేస్తున్న ఎంపీలను సస్పెండ్ చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ మొత్తం 27 మంది సభ్యుల పేర్లు చదివి, వాళ్లందరూ తాను ఎంతగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా సభకు ఆటంకం కలిగిస్తున్నారని, అందువల్ల వాళ్లను వరుసగా 5 రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు.
సస్పెండ్ అయిన వారిలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ అనంతరం ఆమెను సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విపక్షాలకు గౌరవ స్ధానం ఉంది. మంత్రుల మీద ఎఫ్ఐఆర్లు దాఖలు కాలేదు, వాళ్లు తప్పు చేసినట్లు నిర్ధారణ కాలేదు. అందువల్ల వాళ్లు రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెబుతుండగా, విపక్ష కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు గందరగోళం చేశారు.
మంత్రులు రాజీనామా చేయాల్సిందేనంటూ సభ్యులు నినాదాలు చేశారు. ఆ సమయంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే వారికి విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ పై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.