ఐఎస్లో చేరేందుకు యత్నం: నాగ్పూర్ విమానాశ్రయంలో ముగ్గురు హైదరాబాదీల అరెస్టు
నాగ్పూర్/హైదరాబాద్: ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు హైదరాబాద్ విద్యార్థులను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) పోలీసులు శనివారం నాగ్పుర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ నిఘా విభాగం ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారంతో సయ్యద్ ఒమర్ ఫారుఖ్ హుస్సేని(22), అబ్దుల్లా బాసిత్(21), మాజ్ హసన్ ఫారూఖ్(23)ను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం క్యాబ్లో నాగ్పుర్కు వెళ్లిన వీరు అక్కడినుంచి శ్రీనగర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కారు. శ్రీనగర్ వెళ్లిన అనంతరం సరిహద్దులు దాటి అఫ్గానిస్థాన్ వెళ్లాలని వీరు పథకరచన చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
వీరిని తెలంగాణ పోలీసులు శనివారం రాత్రి నగరానికి తీసుకొచ్చారు. వీరు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఇన్ ఇండియా(సిమీ) జాతీయ మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్కు బంధువులు కావడం గమనార్హం.
నిరుడు కూడా వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి హైదరాబాద్కు పంపించి వారిపై నిఘా పెట్టామని, అయితే వారు ఉగ్రవాద భావజాలం ప్రేరేపిత అంతర్జాలం ఫేస్బుక్ను అనుసరించినట్టు తెలుస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల పుణెకు చెందిన 16 ఏళ్ల మైనర్ అమ్మాయిని కూడా కౌనె్సలింగ్ నిర్వహించి కొరియాకు పంపించినట్టు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, సిరియా వెళ్లేందుకు యత్నిస్తున్న ముగ్గురు నగర యువకులను పక్కా సమాచారంతోనే నాగపూర్లో అదుపులోకి తీసుకున్నామని, విచారణ నిమిత్తం హైదరాబాద్కు తీసుకువచ్చినట్లు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్కు తెస్తున్న వీరిని పూర్తిగా విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని తెలంగాణ సిఐడి అధికారులు చెబుతున్నారు.