బోరువెల్ హార్రర్: తెలంగాణలో మూడేళ్ల చిన్నారిని బలి తీసుకున్న బోరుబావి: 25 అడుగుల లోతులో
హైదరాబాద్: బోరుబావి మరో చిన్నారిని మింగేసింది. తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పొడిచన్ పల్లిలో బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సాయి వర్ధన్ మరణించాడు. ఆ చిన్నారి నిర్జీవ దేహాన్ని పోలీసులు, సహాయక సిబ్బంది వెలికి తీశారు. బోరుబావిలో 25 అడుగుల లోతులో సాయి వర్ధన్ మృతదేహం చిక్కుకుని కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టమ్ కోసం అంబులెన్స్లో పాపన్నపేట్ ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు సజీవంగా తిరిగి వస్తాడని ఆశించిన తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
తాత పొలానికి వచ్చి మృత్యుకుహరంలోకి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నివాసం ఉండే గోవర్ధన్, నవీన దంపతుల మూడో కుమారుడు సాయి వర్ధన్. వయస్సు మూడు సంవత్సరాలు. గోవర్ధన్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. నవీన స్వస్థలం పొడిచన్ పల్లి. కొద్దిరోజుల కిందట అతను తన భార్య నవీన, పిల్లలను అత్తగారి ఇంటికి పంపించాడు. నవీన తండ్రి భిక్షపతికి పొడిచన్ పల్లిలో మూడెకరాల పొలం ఉంది. అందులో రెండు బోర్లు వేయించాడు. ఒక బోరులో నీళ్లు పడకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. అలా వదిలేసిన బోరుబావే.. అతని మనవడిని బలి తీసుకుంది. బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ సాయివర్ధన్ దురదృష్టవశావత్తూ బోరుబావిలో పడిపోయాడు.
నాలుగు జేసీబీలతో సమాంతరంగా
సాయివర్ధన్ను రక్షించడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే నాలుగు జేసీబీలను సంఘటనా స్థలానికి రప్పించారు. మరోవంక బోరుబావిలోకి ఆక్సిజన్ను పంపించసాగారు. అంబులెన్స్, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. బోరుబావి సుమారు 150 అడుగుల లోతు వరకు ఉండొచ్చని, సాయి వర్ధన్ 120 అడుగుల లోతులో చిక్కుకుని ఉండొచ్చని ప్రారంభంలో అనుమానించారు. సాయివర్ధన్ 25 అడుగుల లోతులోనే చిక్కుకున్నట్లు గుర్తించారు. లోతు తక్కువే కావడంతో జేసీబీలతో సమాంతర గొయ్యిని తవ్వడం ఆరంభించారు.
Recommended Video
10 గంటల పాటు
సుమారు 10 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలను కొనసాగించారు. గురువారం తెల్లవారు జామున సాయి వర్ధన్ చిక్కుకుపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే సాయి వర్ధన్ నిర్జీవంగా కనిపించాడు. బోరుబావిలో పడిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ చిన్నారి తన తుదిశ్వాస విడిచి ఉండొచ్చని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టమ్ కోసం పాపన్నపేట్ ఆసుపత్రికి తరలించారు. 25 అడుగుల లోతులోనే చిక్కుకుని ఉండటం వల్ల ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఆశించారు. బోరుబావిలో పడిన కొన్ని నిమిషాల్లోనే ఊపిరి ఆడక మరణించి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు.