2ఏళ్ల నరకానికి విముక్తి: ఇరాక్ నుంచి ఢిల్లీకి చేరిన 33మంది తెలుగు కార్మికులు
ఇరాక్లో చిక్కుకుపోయి గడచిన రెండేళ్లుగా తీవ్ర నరకయాతన అనుభవిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 33మంది బాధితులు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఇరాక్లో కన్నీటి వెతలు అనుభవించి
హైదరాబాద్: ఇరాక్లో చిక్కుకుపోయి గడచిన రెండేళ్లుగా తీవ్ర నరకయాతన అనుభవిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 33మంది బాధితులు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఇరాక్లో కన్నీటి వెతలు అనుభవించి స్వస్థలాలకు చేరుకున్న వారిలో 32మంది తెలంగాణ వారు కాగా, ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నారు.
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ నుంచి బాధితులను నేరుగా తెలంగాణ భవన్ కు తరలించారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైల్లో.. గల్ఫ్ బాధితులను హైదరాబాద్ కు తరలించనున్నట్టు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు.
గల్ప్ బాధితుల్లో ఎక్కువగా మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కాగా, ఇరాక్లో తెలుగు వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలంగాణ గల్ఫ్ బాధితుల సంఘం ప్రతినిధి బసంత్రెడ్డి మూడు మాసాల క్రితమే రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన గత మూడు నెలల నుండి కొనసాగించిన కృషి ఎట్టకేలకు ఫలించడంతో బాధితులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
మంత్రి కెటిఆర్.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ను సంప్రదించి బాధితులను ఎలాగైనా స్వస్థలాలకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె ఇరాక్లోని భారత రాయబారి దీపక్ విజ్ఞానితో మాట్లాడారు. కొంత జాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు 33మంది బాధితులను స్వదేశానికి చేర్చారు.
రెండేళ్ల నరకయాతన అనంతరం సురక్షితంగా తిరిగి ఇళ్లకు చేరుకోనుండడం పట్ల బాధిత కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాక్లోని ఎల్బెడ్తో పాటు పరిసర పట్టణాల్లోని కంపెనీల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని గల్ఫ్ ఏజెంట్లు నమ్మబలకడంతో సుమారు 300మంది లక్షా 20వేలు మొదలుకుని లక్షన్నర రూపాయల వర కు వీసాలకు డబ్బులు చెల్లించి ఇరాక్కు పయనమయ్యారు.
స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రోడ్లపైనే, సిమెంట్ పైపుల్లో భారంగా కాలం వెళ్లదీశారు. కాగా, ఏజెంట్ల మోసాలకు మోసపోయామన్నారు ఢిల్లీకి చేరుకున్న బాధితులు. ఇరాక్లో ఎప్పుడు ఎక్కడ బాంబులు, తుపాకులు పేలుతాయో తెలియదన్నారు. ఇరాక్ లో 24 గంటలూ యుద్ద వాతావరణాన్ని తలపిస్తుందని గల్ఫ్ బాధితులు తెలిపారు.