తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు కూడా: తగ్గిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,203 నమూనాలను పరీక్షించగా.. 3821 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,60,141కి చేరింది. తాజాగా మరో 23 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3125కి పెరిగింది.
ఒక్క రోజు వ్యవధిలో 4298 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,18,266కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 92.52 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 38,706 యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు, గత 10 రోజులుగా వ్యాక్సిన్ నిలిపివేయగా, తెలంగాణలో సోమవారం నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అంతేగాక, వ్యాక్సినేషన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయించింది. ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారు, మద్యం అమ్మకాల వారికి టీకా ఇవ్వడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేశారు.
మొదటగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటోడ్రైవర్లుకు వేయాలని నిర్ణయించారు. 18-44 ఏళ్ల వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న 4.90 లక్షల డోసులను సూపర్ స్పైడర్స్కి ఇచ్చేందుకు ఉపయోగించనున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి హరీష్రావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. సూపర్ స్పైడర్లకు టీకాలు వేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.
Recommended Video
కాగా, లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోనివారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఉదయం 10 తర్వాత వచ్చే వాహనాలను సరిహద్దులోనే నిలిపివేస్తున్నారు. దీంతో ఆక్కడే భారీగా వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి.