తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సేఫ్టీ టన్నెల్: దీని ప్రత్యేకత అదే: ఎవ్వరైనా దీని ద్వారనే లోనికి.. !
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తోన్న వేళ.. దాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన సేఫ్ టన్నెల్ను పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఎస్3వీ సేఫ్టీ టన్నెల్ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సహా మనిషి శరీరంపై తిష్ట వేసుక్కూర్చున్న అన్ని రకాల బ్యాక్టీరియాను అంతమొందిస్తుంది ఈ టన్నెల్. దేశంలో పలు చోట్ల ఈ తరహా ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలిసారిగా హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
డీజీపీ మహేందర్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సహా డీజీపీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు ఈ టన్నెల గుండానే లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. కనీసం 20 సెకెన్ల పాటు వారు ఈ టన్నెల్లో గడపాల్సి ఉంటుంది. ఈ టన్నెల్లోనికి ప్రవేశించిన వెంటనే అందులో అమర్చిన పరికరాల ద్వారా వారిపై సోడియం హైపోక్లోరైడ్తో కూడిన డిస్ ఇన్ఫెక్టెంట్ ఆటోమేటిక్గా చల్లుతారు.
Video: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సేఫ్టీ టన్నెల్ pic.twitter.com/Kmur1I1MWp
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2020
సందర్శకుల శరీరంపై వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ ఉంటే వాటిని ఈ డిస్ ఇన్ఫెక్టెంట్ నాశనం చేస్తుంది. ఎస్ 3వీ వాస్కులర్ టెక్నాలజీస్ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ టన్నెల్లోంచి వెళ్లేవారిపై 1.5 మైక్రాన్ల నుంచి 20 మైక్రాన్ల మందంలో ఉండే సూక్ష్మక్రిములు పూర్తిస్థాయిలో నాశనమవుతాయని మహేందర్ రెడ్డి తెలిపారు.
కరోనా వైరస్ ప్రభావం ఇలాగే మరి కొన్నిరోజుల పాటు కొనసాగే పరిస్థితే ఏర్పడితే.. రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనర్, జిల్లా పోలీసు సూపరింటెండెట్ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు.