Telangana Covid cases : తెలంగాణలో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు.. మరో ముగ్గురు మృతి
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. మరో 1843 రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859కి చేరింది.గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో మృతి చెందగా... ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3828కి చేరింది. తాజాగా మరో 614 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,37,789కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 80,653 మందికి కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకూ 2,29,02,812 కరోనా టెస్టులు చేశారు. ఒక మిలియన్ జనాభాకు 6,15,336 కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.38శాతం ఉండగా రాష్ట్రంలో రికవరీ రేటు 98.14 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 0.58శాతం ఉండగా రాష్ట్రంలో 1.3శాతం ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే... గడిచిన 24 గంటల్లో 35,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3,19,69,954కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 447 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ కారణంగా 4,28,309 మంది మరణించారు.మరో 39,686 మంది గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 3,11,39,457 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,02,188 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 97.40 శాతానికి పెరిగింది.
దేశంలో ఇప్పటి వరకూ 50,86,64,759 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.గడిచిన 24 గంటల్లో 16,11,590 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. ఆదివారం(అగస్టు 8) నాటికి దేశవ్యాప్తంగా 48,17,67,232 కరోనా టెస్టులు చేశారు. ఇందులో ఆదివారం ఒక్కరోజే 13,71,871 కరోనా టెస్టులు చేశారు.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూని మరో వారం పాటు పొడగించారు. అగస్టు 10,ఉదయం 6గంటల నుంచి అగస్టు 17 సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వ కార్యాలయాలు 100శాతం సిబ్బందితో నడుస్తాయి. ప్రేవేట్ కార్యాలయాలు,షాపులు ఉదయం 8గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నడుస్తాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.