ఐదుగురు బాలింతల మృతి: నీలోఫర్లో ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్
నీలోఫర్ ఆస్పత్రిలో నెలరోజుల వ్యవధిలోనే ఐదుగురు బాలింతల మరణాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, బాధితుల బంధువులు ఆస్పత్రి ఆవరణలో సోమవారం ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో నెలరోజుల వ్యవధిలోనే ఐదుగురు బాలింతల మరణాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, బాధితుల బంధువులు ఆస్పత్రి ఆవరణలో సోమవారం ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణాలు చోటు చేసుకున్నాయని వారు ఆరోపించారు. ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.
కాగా, రక్తస్రావం ఆగడానికి బాలింతలకు ఇస్తున్న మందులు పనిచేయకపోవడమే బాలింతల మరణాలకు కారణమని పలువురు చెబుతున్నారు. శనివారం రాత్రి మరో బాలింత చనిపోవడంతో ఆస్పత్రి అధికారులు విచారణకు ఆదేశించారు. నెల రోజుల్లో వరుసగా అయిదుగురు బాలింతలు చనిపోవడంతో ఇక్కడ సిజేరియన్లను ఆపేశారు.
3 ఆపరేషన్ టేబుళ్లలో ప్రస్తుతం ఒకటి మాత్రమే పనిచేస్తోంది. అయితే ఈ విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అన్ని విభాగాల అధిపతులతో సూపరింటెండెంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రసవం తర్వాత బాలింతలకు రక్తస్రావం జరుగుతుంది. దీనిని నివారించడానికి ఇంజెక్షన్లు, మందులు ఇస్తుంటారు. ఈ మందులు పనిచేయకపోవడంతో రక్తస్రావం నియంత్రించలేకపోతున్నట్లు తెలిసింది.
ఇలా తీవ్ర రక్తస్రావంతో తాజాగా ఓ బాలింత శనివారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. మరో బాలింత కూడా ఇదే సమస్యతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. వారం క్రితం కూడా ఇద్దరు బాలింతలు ఇలాగే చనిపోయారు. లాలాపేట ప్రాంతానికి చెందిన ఫరా ఫాతిమ (26) జనవరి 28న, మరో మహిళ నుష్రత (20) జనవరి 31న ప్రసవం కోసం అడ్మిట్ అయ్యారు. ఈ ఇద్దరు గర్బిణులు బలహీనంగా ఉండడంతో వారికి సిజేరియన్ చేశారు.
అయితే వీరికి తీవ్ర రక్తస్రావం అయింది. వీరిని కాపాడేందుకు రక్తం ఎక్కించినా ఫలితం లేకపోయింది. మరోవైపు మందులు పనిచేయకపోవడంతో వారిద్దరినీ మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం అర్ధరాత్రి ఫరా ఫాతిమా మృతి చెందగా, గురువారం తెల్లవారుజామున నుష్రత మృతి చెందారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన మృతుల బంధువులు ఆస్పత్రిలో సిబ్బందితో ఘర్షణకు కూడా దిగారు. ఈ ఇద్దరి మృతుల కంటే వారం రోజుల కిందట మరో ఇద్దరు బాలింతలు తీవ్ర రక్తస్రావంతో చనిపోయినట్లు సమాచారం. బాలింతలు వరుసగా చనిపోతుండడంతో సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ఇద్దరు ప్రొఫెసర్లతో విచారణ జరిపిస్తున్నారు.