ఆందోళనకరంగా మిస్సింగ్ లు.. 9 రోజుల్లో 545 మంది అదృశ్యం .. అసలేం జరుగుతుంది
అభం శుభం తెలియని చిన్నారులు అదృశ్యమవుతున్నారు. చిన్నారులే కాదు మధ్యవయస్కులు, వృద్ధులు సైతం కనిపించకుండా పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల్లో 545 మంది అదృశ్యమయ్యారు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రాజధాని పరిసరాల్లోని 296 మంది అదృశ్యమయ్యారు అంటే ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. నానాటికి పెరుగుతున్న అదృశ్యాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఇప్పుడు రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్న మిస్సింగ్ కేసుల వ్యవహారంలో అసలేం జరుగుతుంది అన్నదానిపై వన్ఇండియా అందించే ప్రత్యేకమైన కథనం.
నానాటికీ పెరుగుతున్న మిస్సింగ్ కేసులు .. రోజుకు సగటున 60 మంది మిస్సింగ్
ఆడపిల్లలు అదృశ్యమవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు మాయమౌతున్నారు. కాశ్మీర్ లోని కథువా నుండి తెలంగాణ రాష్ట్రంలోని హాజీపూర్ వరకు ఆడపిల్లల విషయంలో విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిన్నారులు అదృశ్యం అవుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని మన పోలీస్ వ్యవస్థ పరిస్థితుల తీరుకు అద్దం పడుతున్నాయి. తమ పిల్లలు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేసినా , కంటికి కడివెడు దుఃఖించినా లాభం లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇక మిస్సయింది చిన్నపిల్లలైతే, మైనర్లయితే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. తాజా గణాంకాల ప్రకారం రోజుకు సగటున 60 మంది తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యం అవుతున్నారు. ముఖ్యంగా అదృశ్యమవుతున్న వారిలో ఆడపిల్లలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక అదృశ్యమవుతున్న వారిలో 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వయసు వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు అదృశ్యమవుతున్న పోలీసులు ఈ మిస్సింగ్ కేసులను ఏవో కొన్ని మినహాయించి, అన్ని కేసులను పట్టించుకోవడం లేదు.
ఒక్క 9రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో 545 మంది అదృశ్యం .. హైదరాబాద్ లోనే 296 మంది
జూన్ నెల మొదలై 9 రోజుల్లోనే రాష్ట్రంలో 545 మంది అదృశ్యమై కేసులు నమోదయ్యాయి అంటే ఇక నమోదు కాని కేసులు ఎన్నో ఉన్నాయి మనం అంచనా వేసుకోవచ్చు. ఒక భాగ్యనగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 296 మంది కనిపించకుండా పోయారు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నానాటికీ మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అటు పోలీస్ వ్యవస్థకు సైతం మిస్సింగ్ కేసుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. తాము ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామని చెప్తున్నా అంతంత మాత్రమే అని అందరికీ అర్ధం అవుతుంది.
మిస్సింగ్ లకు కారణాలు ఇవే.. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్న నేపధ్యంలోనే ప్రధాన ఆందోళన
ఇక మిస్సింగ్ కు గల ప్రధాన కారణాలు గమనిస్తే ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని పిల్లలే మిస్సింగ్ కు గురవుతున్నారు. అసలు నమోదయ్యే మిస్సింగ్ కేసులలో ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయే వారు ఎక్కువగా ఉంటారు. ఇక ఆ తర్వాత పరీక్షల్లో మార్కులు రాలేదని తల్లిదండ్రులు తిట్టారని, అలిగి ఇంట్లో నుంచి వెళ్లి పోయేవాళ్ళు ఉంటారు. ఇక మధ్యవయస్కులు అయితే భార్యాభర్తల మధ్య పంచాయతీలు, అప్పుల బాధలు, అక్రమ సంబంధాలు తదితర అంశాలతో వెళ్లిపోతుంటారు. ఇక వృద్ధుల విషయానికి వస్తే పిల్లలు తమను సరిగా చూడలేదని బాధతో కొంత మంది వృద్ధులను పిల్లలకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ అటుంచితే బాలికలు ట్రాప్ చేసే ముఠాలు, ప్రేమ పేరుతో మోసం చేసే ముఠాలు, బాలికలు, మహిళలను తీసుకుని వెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించే ముఠాలు కూడా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. అంతేకాదు అత్యాచారానికి పాల్పడుతూ, హత్య చేస్తూ దొరకకుండా తప్పించుకుంటున్న ముఠాలు సైతం ఉన్నాయి.
పోలీసుల చర్యలు అంతంత మాత్రమే .. హాజీపూర్ ఘటనే సాక్ష్యం
ప్రస్తుతం అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మిస్సింగ్ కేసులపై ఆందోళన నెలకొంది.పోలీసులు తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పినా, అరాకొరా మిస్సింగ్ కేసు లను ట్రేస్ అవుట్ చేసినా పూర్తిస్థాయిలో మిస్సింగ్ కేసుల సమస్యలు మాత్రం పరిష్కరించలేక పోతున్నారు. ఇక అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ కేసుల విషయంలో త్వరిత గతిన కేసులను చేధిస్తున్నామని చెప్పినప్పటికీ అన్ని కేసుల విషయంలో కాదు .
సగటున 10 కేసులు నమోదైతే ఒకటి అరా కేసులు మాత్రమే పోలీసులు పట్టుకో గలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై పోలీసుల నిర్లక్ష్యం హాజీపూర్ ఘటనతోనే అందరికీ అర్థమైంది. హాజీపూర్ లో బాలికలు అదృశ్యం అవుతున్నారని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పోలీసుల నిర్లక్ష్యం నలుగురు బాలికలను పొట్టనపెట్టుకుంది. అత్యాచారాలు చేసి హత్య చేసిన నేరస్తులు దర్జాగా సొసైటీలో తిరుగుతున్నారు అంటే అది ఖచ్చితంగా పోలీసులు నిర్లక్ష్యంగా అని చెప్పాలి.
పోలీసులు మిస్సింగ్ కేసులపై దృష్టి సారించటం తక్షణ కర్తవ్యం . .. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త
అయితే ఈ విషయంలో పోలీసులు చెప్పే కారణాలు వేరేలా ఉన్నాయి . శాంతిభద్రతల పరిరక్షణ కోసం పని చేయాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్ లో నమోదైన అన్ని కేసుల పైన దృష్టి పెట్టాల్సిన నేపథ్యంలో నానాటికీ పెరుగుతున్న మిస్సింగ్ కేసుల విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రధానంగా అదృశ్యానికి కారణం పిల్లల పైన తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం అని వారంటున్నారు. కొన్ని మిస్సింగ్ కేసులను మిస్సయిన 24 గంటల్లోపే చేధిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను భయాందోళనలకు గురి కావద్దని, ఖచ్చితంగా అన్ని మిస్సింగ్ కేసులను ఛేదిస్తామని సైబరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు.
ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో భయాందోళనలకు గురి చేస్తున్న మిస్సింగ్ కేసుల పైన పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అటు తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు కళాశాలలో చదువుతున్నారా లేదా వంటి అంశాల పైన పర్యవేక్షణ ఉండాలి. ఇక చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదు. సాధ్యమైనంతవరకు తమ కనుసన్నల్లోనే ఉండేలాగ పిల్లలను చూసుకోవాలి.