నివ్వెరపోయే నిజాలు : తెలంగాణ-ఏపీల్లో 56మంది చిన్నారులపై రేప్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహిళా భద్రతకు సంబంధించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. జాతీయ నేర విభాగం విడుదల చేసిన క్రైమ్ గణాంకాల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం.. ఒక్క 2015లోనే 66 మంది చిన్నారులు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలకు గురయ్యారు.
గతంతో పోల్చి చూస్తే.. ఒక్కసారిగా అత్యాచార నేరాలు పెరిగిపోవడం గమనార్హం. మొత్తంగా.. 2100 మంది మహిళలు తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం అత్యాచారానికి గురైనట్లుగా క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువ మంది అత్యాచార బాధితులు 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్కులే కావడం గమనార్హం.
60 ఏళ్లు పైబడ్డ వృద్ద మహిళలపై కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. 2015లో ఆరుగురు వృద్ద మహిళలు తెలంగాణలో అత్యాచారానికి గురికాగా, ఏపీలో ముగ్గురు వృద్ద మహిళలు అత్యాచారానికి గురయ్యారు.
దేశం మొత్తం మీద మహిళలపై చోటు చేసుకుంటున్న నేరాల్లో.. 9.5 శాతం నేరాలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇక గ్యాంగ్ రేప్ ల విషయంలోను, మహిళల అపహరణలోను, వరకట్న చావుల్లోను, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ నేరాలు నమోదైనట్లుగా క్రైమ్ బ్యూరో గణంకాలు చెబుతున్నాయి.
ఇక కేసుల విషయానికొస్తే.. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి గత సంవత్సరం ఏపీలో 15,931 కేసులు నమోదైతే.. తెలంగాణలో 15,131 కేసులు నమోదయ్యాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిబంధనల నేపథ్యంలోనే చాలామంది మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఘటనలపై ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే గతంతో పోలిస్తే 2015లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని అంటున్నారు తెలంగాణ-ఏపీ పోలీస్.