నోట్ల రద్దు ఎఫెక్ట్?: పెరిగిన జోష్, ఏపీ, తెలంగాణల్లో మద్యం ఏరులు
2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2017 సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందబాబులు వేడుకను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై పెద్ద నోట్ల ప్రభావం చాలానే ఉంటుందనీ, గతంలో పోలిస్తే కొంత తక్కువ స్థాయిలోనే మద్యం అమ్మకాలు, ఖర్చులు తగ్గే అవకాశం ఉందని అందరూ భావించినా.. కానీ అలాంటిదేమీ జరగలేదు. మద్యం అమ్మకాల్లో న్యూఇయర్ జోష్ కనిపించింది. 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2017 సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందబాబులు వేడుకను ఘనంగా నిర్వహించారు.
అర్ధరాత్రి ఎక్కడ చూసినా మద్యం షాపుల వద్ద రాత్రి 12 గంటల వరకూ భారీ క్యూలే దర్శనమిచ్చాయి. డిసెంబరు 31న ఏకంగా రూ.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. స్వైపింగ్ మిషన్లు ఉన్న మద్యం షాపుల్లో కొంత ఎక్కువ అమ్మకాలు జరిగినట్ల్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పెద్ద నోట్లను రద్దు చేయకుంటే మద్యం అమ్మకాలు ఇంకా ఎక్కువగానే ఉండేవని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో 2,144 మద్యం షాపులు, 853 బార్లు, 27 క్లబ్బులు ఉన్నాయి. ఈసారి ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయ వేళల్లో సడలింపునిచ్చింది. మద్యం షాపుల్లో రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు, టూరిజం కార్పొరేషన హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతించింది. దీంతో రాత్రి 7.30 గంటల నుంచి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు విపరీతంగా జరిగాయి.
వాస్తవానికి గత ఏడాది డిసెంబరు 31న కూడా రూ.74 కోట్ల విక్రయాలే సాగాయి. కానీ, ఈసారి పెద్ద నోట్లు రద్దయిన నవంబర్ 8 నుంచి విక్రయాలు కొంత మందగించాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో కూడా ఇలాగే ఉంటుందని అధికారులు భావించారు. ఇందుకు భిన్నంగా గత ఏడాది రికార్డునే కొనసాగిస్తూ విక్రయాలు సాగడం విశేషం.
ఏపీలోనూ జోరుగానే..
కొత్త సంవత్సర స్వాగత వేడుకల్లో మద్యం అమ్మకాలు ఏపీలోనూ జోరుగా సాగాయి. నగదు కొరత ఉన్నా.. మందు బాబులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. గతేడాది నూతన సంవత్సర సంబరాల సందర్భంగా జరిగిన మద్యం విక్రయాలతో పోలిస్తే ఈ సారి భారీగా పెరిగాయి.
డిపోల నుంచి మద్యం దుకాణాలకు 2016 డిసెంబరు 30, 31వ తేదీల్లో రూ.162.51 కోట్ల విలువైన మద్యం సరఫరా జరగింది. డిసెంబరు 31వ తేదీ రాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాల ద్వారా సుమారు రూ.120 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖాధికారుల అంచనా. మొత్తం 4.26 లక్షల కేసుల ఐఎంఎల్, 1.32 లక్షల కేసుల బీర్లు మద్యం డిపోల నుంచి దుకాణాలకు గడిచిన రెండు రోజుల్లో సరఫరా అయ్యాయి.
రాష్ట్రంలోని 23 మద్యం డిపోల నుంచి 2015 డిసెంబరు 30, 31వ తేదీల్లో రూ.151.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా 2016 డిసెంబరు 30, 31వ తేదీల్లో రూ.162.51 కోట్ల మేర జరిగాయి. అంతకు ముందుతో పోలిస్తే రూ.11.11 కోట్ల మేర విక్రయాలు పెరిగడం గమనార్హం.