అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తుంది: గవర్నర్
హైదరాబాద్: 66వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహాన్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, ఇది బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందడానికి అందరి సహకారం అవసరమని చెప్పారు. వెనకబాటుతనానికి, పేదరికానికి రాజకీయాలే కారణమని, అవినీతికి ఆస్కారం లేని పాలనను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎక్స్ ప్రెస్ హైవేలను అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పాలనను అందిస్తామని, విద్యుత్ సమస్యను అధిగమించేందుకు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నామని, రానున్న మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమిస్తామని చెప్పారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా వాటర్గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానించేందుకు కొత్త ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చిందన్నారు. కొత్త రాష్ర్టానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరుగుతోందని గవర్నర్ నరసింహన్ తెలిపారు.
తెలంగాణ సాంస్కృతిక సారధి ద్వారా కళలకు ప్రోత్సాహం కల్పిస్తుందని తెలిపారు. వరంగల్ జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. నల్లగొండ జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకు నక్కలగండి ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులిచ్చిందన్నారు.
హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పథకం అమలు చేస్తున్న తీరు అమోఘమన్నారు. రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేసింది. బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. అంతక ముందు పరేడ్ గ్రౌండ్ వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా గణతంత్ర వేడుకలు, శకటాల ప్రదర్శన రద్దు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ నరసింహాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, పోలీసు ఉన్నాతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ పాల్గొన్నారు. సమయం తక్కువగా ఉండటంతో శకటాల ప్రదర్శన రద్దు చేశారు.