ఇంటి ముందే బాలుడి కిడ్నాప్, దారుణ హత్య: మూటలో కట్టిపడేశారు
హైదరాబాద్: నగరంలోని భవనీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడ్ని కిడ్నాప్ చేసిన దుండగులు.. దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్స్పెక్టర్ వై నాగేశ్వరరావు కథనం ప్రకారం... యాకుత్పురా సెగ్మెంట్ తలాబ్కట్ట మహమ్మద్ నగర్ బస్తీకి చెందిన దంపతులు మహ్మద్ ఏజాజ్ ఆలీ, అంజూమ్ ఫాతిమాలకు ముగ్గురు సంతానం(ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె). చిన్నవాడైన మమ్మద్ ఉమర్ఆలీ(4) స్థానికంగా ఉన్న పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.
అయితే, గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకొంటూ కనిపించకుండా పోయాడు. బాలుడి తల్లిదండ్రులు అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శుక్రవారం ఏజాజ్ ఆలీ.. భవానీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మహమ్మనగర్ బస్తీకి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో శవం ఉందని సమాచారం అందడంతో క్రైం పార్టీ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు.
బాలుడిని తాళ్లతో కట్టి అతి కిరాతకంగా చంపి ఒక గుడ్డలో మూట కట్టిపడేసినట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలీ మృతి చెందాడని తెలిసి.. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.