చదివింది ఐటిఐ, డాక్టరయ్యాడు, అదెలా సాధ్యమైంది?
ఐటిఐ చదివి డాక్టర్ అవతారమెత్తాడు ఓ యువకుడు.కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో క్లినిక్ ను ప్రారంభించాడు. అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతణ్ణి అరెస్టు చేశారు.
గోదావరి ఖని :ఐటిఐ చదువుకొని డాక్టర్ అయ్యాడు ఓ వ్యక్తి. ఐటిఐ చదివి డాక్టర్ ఎలా అయ్యాడో అర్థంకావడం లేదా... నకిలీ సర్టిఫికెట్ తో డాక్టర్ అవతారం ఎత్తాడు,. అసలు వైద్యుడు పాటించాల్సిన కనీస ప్రమాణాలను కూడ ఆయన పాటించడం లేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది.
కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలోని మార్కండేయనగర్ లో సంపత్ కుమార్ నివాసం ఉంటున్నాడు. ఆయన ఓ క్లినిక్ ను ఇటీవలే ప్రారంభించాడు.ఆయుర్వేదిక్ డాక్టర్ గా పరిచయం చేసుకొని స్థానికులకు చికిత్సను ప్రారంభించాడు.
అసలు సంపత్ కుమార్ ఐటిఐ చదివాడు. వైద్య వృత్తికి ఆయన చదువుకొన్న చదువుకు సంబంధం లేనేలేదు. ఐటిఐ చదవుకొన్న తర్వాత కాగజ్ నగర్ లోని బంగారు దుకాణంలో కొంత కాలంపాటు పనిచేశాడు.
అయితే అక్కడి నుండి నేరుగా హైద్రాబాద్ కు వెళ్ళి కొంత కాలంపాటు ఏదో ఒక పనిచేస్తూ కాలం వెళ్ళదీశాడు. అయితే డబ్బులు సులభంగా సంపాదించే మార్గం కోసం అన్వేషించాడు సంపత్ కుమార్.
వైద్యవృత్తిలో సులభంగా డబ్బులను సంపాదించే అవకాశం ఉందని భావించాడు. అయితే నేచురోపతి నకిలీ సర్టిఫికెట్ ను సంపాదించాడు. గోదావరిఖనిలోని మార్కండేయనగర్ లో క్లినిక్ ను ప్రారంభించాడు.
సంపత్ కుమార్ వైద్యంపై స్థానికులకు అనుమానం వచ్చింది. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆదారంగా సంపత్ కుమార్ క్లినిక్ పై పోలీసులు దాడి చేశారు. అతని నుండి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకొన్నారు.