విషాదం: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే ఖమ్మం జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది.
ఖమ్మం: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే ఖమ్మం జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. రఘునాథపాలెం మండల పరిధిలోని పుటనీతండాలో భరత్ అనే ఐదేళ్ల బాలుడుపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న భరత్పై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మృతితో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తరచూ మనుషులపై కుక్కలు దాడులు చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వీధి కుక్కలను జనసంచారం లేని ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.
హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లోనూ కుక్కల దాడుల్లో గాయపడిన బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నగరంలోని బాలానగర్లో వీధి కుక్కల దాడిలో 16 మంది గాయపడటం గమనార్హం. కుక్కలు దాడులు చేస్తున్నా.. అధికారులు మాత్రం మాటలకే పరిమితమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications