షాకింగ్: ప్రేమ అంగీకరించలేదని, ప్రియుడితో కలిసి కన్నతండ్రినే హతమార్చింది
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ యువతి కన్నతండ్రినే హత్య చేసింది. జులైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నిజాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జులై 20న కాప్రాలో రామకృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పాద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపడంతో అసలు నిజం వెలుగుచూసింది.

కూతురు ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించని తండ్రి..
వివరాల్లోకి వెళితే.. రామకృష్ణ కూతురు నారాయణగూడకు చెందిన భూపాల్ అనే యువకుడ్ని ప్రేమించింది. అయితే, వీరి ప్రేమ వ్యవహారం ఇష్టంలేని తండ్రి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడంతో కొన్ని రోజులు జైల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన భూపాల్.. ప్రియురాలి తండ్రి రామకృష్ణపై పగ పెంచుకున్నాడు.

ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన కూతురు..
రామకృష్ణను అంతం చేసేందుకు అతని కుమార్తెతో కలిసి కుట్ర పన్నాడు. అతడిని హత్య చేస్తే రూ. 2 లక్షలు ఇచ్చేలా మిత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకంలో భాగంగా రామకృష్ణ కుమార్తె జులై 19న తండ్రి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తిన్న రామకృష్ణ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత మిత్రులతో కలిసి వచ్చిన భూపాల్.. రామకృష్ణ గొంతునులిమి, కణతిపై పొడిచి పారిపోయారు. జులై 20న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరపడంతో మృతుడి కుమార్తె, ఆమె ప్రియుడే హంతకులుగా తేలింది. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు.

పంజాగుట్ట బాలిక హత్య కేసులో తల్లే హంతకురాలు
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక తల్లే ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అక్రమసంబంధం పెట్టుకున్న తల్లే కూతుర్ను హతమార్చిందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్లోని అజ్మీర్లో తల్లి హీనాబేగం, ప్రియుడు షేక్ మహ్మద్ ఖాదర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలోని ద్వారకపురికాలనీలో ఒక దుకాణం ముందు 8ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి కొంతదూరంలో లభించిన ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

ప్రియుడితో కలిసి బాలికను కొట్టిచంపిన తల్లి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేటలో ఉండే ఖాదర్తో హీనాబేగంకు పరిచయం ఏర్పడింది. సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లల్ని తీసుకుని ఇద్దరూ ముంబై, చెన్నై, జైపూర్ మనాలి వెళ్లారు. అక్కడ పిల్లలతో భిక్షాటన చేయించారు. చిన్నారి మెహక్ భిక్షాటన చేయడం ఇష్టం లేక నిరాకరించింది. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయగా.. ఖాదర్, హీనాలు ఆ చిన్నారిని తీవ్రంగా కొట్టి చంపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చిన్నారి మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ద్వారకపురికాలనీలోని ఓ షాపు వద్ద వదిలి వెళ్లారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో పోలీసులకు కేసు సవాలుగా మారింది. లక్డీకాపూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications