దూరం పెంచిన విద్య: తల్లిని చూసిన ఆనందంలో ఆగిన చిన్నారి గుండె
వరంగల్: తల్లిదండ్రుల ఒడిలో ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయస్సులోనే నేటి చదువులు పిల్లలను వారి ఆలనాపాలనకు దూరం చేస్తున్నాయి. రెండు మూడేళ్లకే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో పంపేస్తున్నారు. కొందరైతే ఏకంగా హాస్టళ్లలోనే వేసేస్తున్నారు. అంత చిన్న వయస్సులో ఆ పిల్లలు ఎంత మనోవేదనకు గురవుతారో తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు. తోటి వారికన్నా వెనకబడిపోతారన్న ఆలోచనతో తల్లిదండ్రుల తొందర.. వారిని ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తోంది. తాజా ఘటన అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
చాలా మంది పిల్లల్లానే అమ్మకు దూరంగా వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఓ చిన్నారి.. తనను చూసేందుకు వచ్చిన తల్లిని చూసి సంతోషపడింది. పట్టరాని ఉత్సాహంతో పరుగు తీసింది. తల్లి ఒడిలో ఒదిగిపోయింది. తనివితీరా హత్తుకున్న అమ్మ బిడ్డను ముద్దాడుతుంటే చలనం లేకుండా అలాగే ఉండిపోయింది. అమ్మను చూసిన ఆనందంలో అప్పటికే ఆ చిట్టి గుండె ఆగిపోయింది. ఈ హృదయవిదారక ఘటన ధర్మసాగర్ మండలం కరుణాపురం లిటిల్ ఫ్లవర్ స్కూల్ వసతిగృహంలో ఆదివారం చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లికి చెందిన ఈడపు రమ-సమ్మయ్య దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. బధిరురాలైన కుమార్తె కావ్య(11) కరుణాపురంలో బధిర విద్యార్థుల కోసం నడుపుతున్న లిటిల్ ప్లవర్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. అక్కడే వసతిగృహంలో ఉంటోంది. తల్లిదండ్రులు అప్పుడప్పుడు వెళ్లి బిడ్డను చూసి వచ్చేవారు.
ఎప్పటిలాగే రమ ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామం నుంచి పాఠశాలకు వెళ్లింది. అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుకుంటున్న కావ్య.. అమ్మను చూసి సంతోషంగా పరుగుపరుగున వచ్చి తల్లిని హత్తుకుంది. రమ కూడా సంతోషంతో హత్తుకొని ఎత్తుకుంది. బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించగా క్షణకాలంలో కావ్య అచేతనంగా చేతుల్లోంచి జారిపోవడంతో ఆ తల్లికి కూడా గుండె ఆగినంత పనైంది.
ఏం జరిగిందో పరిస్థితి అర్థంగాక బిడ్డను తట్టి చూచే సరికే పాప స్పృహ కోల్పోయింది. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పుటికే పాప చనిపోయినట్లు చెప్పడంతో ఆ తల్లిని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరీ తరమూ కాలేదు. కాగా, కావ్య ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉండేదని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.