తల్లి మరణం, తండ్రి మరో పెళ్లి: విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: కన్నతల్లి చనిపోవడంతో ఏడాది కాలంగా మనస్తాపంతో బాధపడుతున్న పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ అంబర్ పేట మల్లిఖార్జుననగర్ లో నివాసముంటూ పాల వ్యాపారం చేస్తున్న రమేష్ రెడ్డి, మనోర దంపతుల కూతురు దీపిక(15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కాగా, దీపిక తల్లి మనోర గత 2015, జనవరిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అప్పటి నుంచి తమ తల్లి తమను వదిలేసి వెళ్లిందనే మనస్తాపంతో దీపిక ఎంతో ఆవేదనకు గురైంది. అయితే, తండ్రి రమేష్ రెడ్డి గత నాలుగు నెలల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. తన చిన్నమ్మ కూడా బాగా చూసుకున్నప్పటికీ దీపిక మాత్రం తల్లి మరణాన్ని మరిచిపోలేకపోయింది. మంగళవారం రాత్రి 9గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
3వ అంతస్తు పైనుంచి పడి విద్యార్థిని మృతి
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని 13వ అంతస్తుల భవనంపై నుంచి పడి మృతి చెందిన విషాద ఘటన చందానగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఉమాగుప్తా కుమార్తె రీచాగుప్తా(17) ఎంసెట్ రాసేందుకు ఇటీవల నగరానికి వచ్చింది.
నల్గొండ హిమసాయి లేక్ వ్యూ అపార్టుమెంట్ 13వ అంతస్తులో ఉంటున్న అక్క రాగిణిగుప్తా, బావ అమిత్గుప్తా ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి కారిడార్లో బట్టలు తీస్తుండగా ప్రమాదవశాత్తు 13వ అంతస్తు నుంచి పడిపోయింది.
స్థానికులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంసెట్లో అర్హత సాధించలేకపోయినందున ఆత్మహత్య చేసుకుందా? లేక ప్రమాదవశాత్తూ పడిపోయిందా.. అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.