మిస్సయిన ఎన్నారై శవమై తేలాడు.. బోయిన్ పల్లిలో కిరాతకంగా హత్య
హైదరాబాద్ : కనిపించకుండా పోయిన గౌతం రెడ్డి అనే ఓ ఎన్నారై.. శవమై తేలాడు. గత సోమవారం నాడే కెన్యా నుంచి హైదరాబాద్ చేరుకున్న గౌతం రెడ్డి, అదే రోజు అదృశ్యమయిపోయాడు. శుక్రవారం ఉదయం అతను శవమై కనిపించడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.
బోయిన్పల్లి సమీపంలో ఉన్న డెయిరీ ఫామ్ హౌజ్ లో అతని మృతదేహం లభ్యమవగా.. దుండగుల చేతిలోనే హతమయినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గౌతం రెడ్డిని హత్య చేసిన దుండగులు అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గౌతరం రెడ్డి కుటుంబ సభ్యులను పిలిపించడంతో.. మృతదేహం అతనిదే అని నిర్దారించారు.
ఎనిమిదేళ్లుగా కెన్యాలో ఉంటోన్న గౌతంరెడ్డి గత సోమవారమే హైదరాబాద్ కు తిరగొచ్చాడు. హత్య చేసిందెవరో గానీ టార్గెట్ చేసి మరీ గౌతం రెడ్డిని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య చేయబడ్డ గౌతం రెడ్డి చాలా మంచి వ్యక్తి అని అక్కడి స్థానికులు చెబుతుండడం గమనార్హం.