ప్రియురాలి వేధింపులు భరించలేక ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం... గోల్నాకలో నివాసముంటున్న టి అశ్విన్(32) నల్లకుంట నర్సింహబస్తీకి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు.
వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడి కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. గతంలో వీరిరువురు ఒకరికొకరు మాట్లాడుకోమని పోలీసుల సమక్షంలో లఖిత పూర్వకంగా ఒప్పంద పత్రాన్ని కూడా రాసి ఇచ్చారు. కాగా, రెండు నెలల క్రితం అశ్విన్కు పెళ్లి ఖాయమైంది.
ఈ నేపథ్యంలో ఆ యువతి జనవరి 2న అశ్విన్ తనను మానసికంగా వేధిస్తున్నాడని నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అశ్విన్ను స్టేషన్కు రావాలని పిలిచారు. తీవ్ర ఆందోళనకు గురైన అశ్విన్ క్రిమిసంహారక మందు తాగాడు. అలాగే వచ్చి స్టేషన్లో కుప్పకూలిపోయాడు.
దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశ్విన్ మృతి చెందాడు. పోలీసులు, ఆ యువతి వేధింపుల వల్లే అశ్విన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.