భార్యను రోకలిబండతో మోది చంపిన భర్త: యువతిని..
ఖమ్మం: జిల్లాలోని తాళ్లగూడెంలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను రోకలి బండతో మోది చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాడేపల్లి ప్రభాకర్ మద్యం తాగివచ్చి తన భార్య సంధ్య(35)తో గొడవకు దిగాడు.
గొడవ పెరగడంతో ప్రభాకర్ మద్యం మత్తులో తీవ్ర ఆవేశానికి గురై పక్కనే ఉన్న రోకలిబండతో సంధ్య నెత్తిపై మోదాడు. బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకున్న కుమారుడు ఉపేంద్రను సైతం రోకలిబండతో కొట్టడంతో అతనికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడ్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమపేరిట యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు
ప్రేమించానని నమ్మించి, ఓ యువతిని లొంగదీసుకుని, పెళ్ళి విషయం వచ్చే సరికి.. ముఖం చాటేసిన యువకుడిపై మంగళవారం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని సర్వారం గుడి తండాకు చెందిన యువతి(17)ని అదే ప్రాంతానికి చెందిన మాళోతు రాజా అనే యువకుడు ప్రేమించానని నమ్మించాడు.
లొంగదీసుకును కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పెద్దలకు ఈ విషయం తెలిసీ పెళ్లి చేసుకోవాలని కోరగా, రాజా తనకు సంబంధం లేదని ముఖం చాటేశాడు. యువకుడి తల్లిదండ్రులను యువతి కుటుంబసభ్యులు నిలదీయగా, దాడికి యత్నించారు. యువతిని రాజా కత్తితో బెదిరింపులకు గురిచేశాడు.
దీంతో యువతి కుటుంబసభ్యులు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.