దారుణం: మంత్రాలు చేస్తున్నాడని నరికి చంపారు
ఆదిలాబాద్: మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని నరికి చంపారు. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంకుసాపూర్కు చెందిన బామ్నె గణపతి కూతురు రెండునెలల కిందట అనారోగ్యంతో చనిపోయింది.
కాగా, తన కూతురు మృతికి సమీప బంధువు కవాల్కర్ సంతోశ్(30) మంత్రాలే కారణమని గణపతి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సంతోశ్ పై గొడ్డలితో దాడిచేసి నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశాడు
ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశాడు ఓ కసాయి అన్న. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామంలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మడమడక గ్రామ పంచాయతీ పరిధిలోని షాకెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు నీలం నిరంజన్(28), నీలం రమేష్(22)లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో వారి మధ్య కొద్ది రోజులుగా వచ్చిన మనస్ఫర్థలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
గురువారం తెల్లవారుజామున రమేష్ నిద్రిస్తున్న సమయంలో నిరంజన్ రోకలిబండతో అతనిపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.