అనుమానం: భార్యను రోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు
కరీంనగర్: జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్తే నరికి చంపాడు. రోడ్డుపై నడిచివెళ్తున్న భార్య మమతను భర్త మల్లేశ్ కత్తితో పొడిచి చంపాడు.
కుటుంబ కలహాల కారణంగా మమత గత కొంతకాలం నుంచి ఆమె తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మల్లేష్ కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
మూడేళ్ల బాలిక కిడ్నాప్
హైదరాబాద్: ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి అదృశ్యమైంది. బాలిక కోసం మూడు రోజులుగా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులు చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్నగర్ కడ్తాల్కు చెందిన వెంకటేష్ కుటుంబం కొంతకాలం క్రితం రాజధానికి వలస వచ్చింది.
ఓల్డ్మలక్పేటలోని సోని విజన్ అపార్టుమెంట్లో వెంకటేష్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వారి అపార్టుమెంట్ సమీపంలోనే వెంకటేష్ బంధువులు నివాసముంటారు. వెంకటేష్ మూడేళ్ల కుమార్తె అలివేలు తరచూ వారింటికి వెళ్లి వస్తుంది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 25న అలివేలు ఇంట్లోనుంచి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తర్వాత వాళ్లింటికి కూడా రాలేదు. దీంతో బాలిక కోసం స్వగ్రామం పాలమూరుతోపాటు నగరంలో అనేకచోట్ల గాలించారు. బాలిక చెవి పోగుల కోసం ఎవరైనా కిడ్నాప్ చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.