భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు .. ఒక మావోయిస్ట్ మృతి
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నేపథ్యంలో తెలంగాణా, చత్తీస్ గడ్, ఆంధ్ర ఒడిశా బోర్డర్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించి అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. మావోయిస్ట్ వారోత్సవాలలో భాగంగా విధ్వంసం సృష్టించడానికి చర్ల ఎల్ఓఎస్ మరియు బెటాలియన్ యాక్షన్ టీంలు కుర్ణపల్లి - బోదనెల్లి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు... ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో, తెలంగాణాలోనూ హై అలెర్ట్
10 మంది సాయుధ మావోయిస్టులు బోధనెల్లికి తూర్పు దిశలో 3 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తున్నారని సెర్చ్ ఆపరేషన్ కు వెళ్ళిన పోలీసు బలగాలకు మరియు మావోయిస్టులకు బోధనెల్లికి తూర్పు దిశలో 3 కిలోమీటర్ల దూరంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మరణించాడు. కాల్పులు జరిగిన ప్రదేశంలో సుమారుగా 23 సంవత్సరాల వయసు కలిగిన మావోయిస్టు మృతదేహాన్ని, 303 రైఫిల్, రెండు కిట్ బ్యాగులను పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మావోయిస్ట్ ఎవరు అనేది గుర్తించాల్సి ఉంది. కాల్పులు జరిగిన పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
విశాఖ ఏజెన్సీలో మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ లు రంగంలోకి దిగుతాయని ఇప్పటికే వాహనాలను జోరుగా తనిఖీ చేస్తున్నారు. రంగంలోకి దిగిన అదనపు పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతాన్ని అడుగడుగున గాలిస్తున్నాయి. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను మిలిషియా నాయకులు హతమార్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు, ఈ క్రమంలోనే ముందస్తు చర్యలకు దిగినట్లుగా సమాచారం. ఇక మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవటానికి ఇప్పటికే వెంకటాపూర్, చర్ల మండలాల్లో పోస్టర్లు వేశారు.