విషాదం: 9 గంటలు కారులోనే... వెంటిలేటర్ బెడ్ దొరక్క కన్నుమూసిన మసీదు పెద్ద
హైదరాబాద్: కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రులు అదనంగా వచ్చే కరోనా రోగులను చేర్చుకోవడం లేదు. ఈ కారణంగా పలువురు కరోనా బాధితులు సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ మత పెద్ద కూడా రంజాన్ ముందు రోజు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంతోపాటు స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాదులో లాక్డౌన్ దృశ్యాలు
మూడు రోజుల క్రితం కరోనా బారినపడిన పాషా
మల్లాపూర్ డివిజన్కు పాషా(50) గ్రీన్ హిల్స్ కాలనీలోని మహ్మదీమ మసీదుకు సదర్గా ఉన్నారు. అయితే, ఆయన మూడు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆయనను కారులో ఆక్సిజన్ ఏర్పాటు చేసుకుని గచ్చిబౌలి టిమ్స్కు వెళ్లారు. రెండు గంటలపాటు బయటే ఉంచి ఆ తర్వాత పడకలు ఖాళీగా లేవని పంపించారు. దీంతో కారులో తిరుగుతూ పలు ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించగా.. పడకలు ఉన్నప్పటికీ.. వెంటిలేషన్ సౌకర్యం లేదన్నారు.
9 గంటలపాటు కారులోనే ప్రయాణం..
కాగా, నాచారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం కొద్ది సేపు ఆక్సిజన్ పెట్టి పరిస్థితి విషమంగా ఉందని.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది సూచించారు. ఈ క్రామంలో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా, గాంధీలో వెంటిలేటర్ బెడ్ దొరకలేదు. సుమారు 9 గంటలపాటు కారులోనే ప్రయాణించారు పాషా.
Recommended Video
గురువారం కూడా వెంటిలేటర్ దొరక్క తుదిశ్వాస విడిచారు
ఇక గురువారం కూడా వెంటిలేటర్ బెడ్ లభించకపోవడంతో పలువురికి సాయం కోసం ఫోన్ చేశారు. శుక్రవారంనాడు రంజాన్ పండగ ఉందని, వెంటిలేటర్ సాయం అందించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు పాషా కుటుంబసభ్యులు, బంధవులు. వారి ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పాషా తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రంజాన్ ముందు రోజు పాషా మరణించడంతో ఆయన కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వైద్యం అందక చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉండటం శోచనీయం.