పిల్లలతో సహా నిప్పంటించుకుంది: తల్లి, చిన్న కూతురు మృతి, చావుబతుకుల్లో మరో కూతురు
క్షణికావేశంలో ఓ గృహిణి తీసుకొన్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొంది. కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులతో తనతో పాటు ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించగా తల్లీకూతురు మృతిచెందారు. మరో కూతురు తీవ్ర గ
వరంగల్: క్షణికావేశంలో ఓ గృహిణి తీసుకొన్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొంది. కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులతో తనతో పాటు ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించగా తల్లీకూతురు మృతిచెందారు. మరో కూతురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకొన్న ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానిక బెస్తం చెరువు ప్రాంతంలో నివసిస్తున్న భూమ శివశంకర్ తాపీమేస్త్రీగా పనులు చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం ఈయనకు భవాని (26)తో వివాహమైంది. వీరికి అమృతవర్షిణి (4), లలిత వర్షిణి (1) కుమార్తెలున్నారు.

ఒకే ఇంటిలోని ఓ గదిలో శివశంకర్ దంపతులు ఉండగా పక్కనే ఉన్న మరో గదిలో ఆడబిడ్డ స్రవంతి, అత్త విజయ ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నా వీరి మధ్య రోజూ గోడవలు జరిగేవి. ఆదివారం రాత్రి సైతం గొడవ జరగ్గా భవాని మనస్తాపంతో సోమవారం తెల్లవారుజామున భర్త బహిర్భూమికి బయటికి వెళ్లిన సమయంలో ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి, తనపైనా పోసుకుని నిప్పంటించుకొంది.
మంటలకు తాళలేక కేకలు వేయడంతో స్థానికులు తలుపులు బద్దలుకొట్టి మంటల్లో చిక్కుకున్న తల్లీకూతుళ్లను బయటికి తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే తీవ్రంగా కాలినగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న భవానీతో పాటు కుమార్తెలను చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భవాని, చిన్న కుమార్తె లలితవర్షిణి మృతిచెందారు.
తీవ్ర గాయాలతో అమృతవర్షిణి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్సపొందుతూ అత్త, ఆడబిడ్డల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు భవాని మరణ వాంగ్మూలంలో తెలిపింది. సంఘటన స్థలాన్ని మామునూరు ఏసీపీ పుల్లా శోభన్కుమార్, సీఐ జూపల్లి శివరామయ్య సందర్శించారు. స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. మృతురాలి తల్లి జూల రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.












Click it and Unblock the Notifications