బాలికపై ఎమ్మార్వో రేప్యత్నం, చితకబాదారు
ఖమ్మం: బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ అధికారి మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. ఆ బాలిక కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో నిందితుడ్ని స్థానికులు, బాలిక కుటుంబసభ్యులు కలిసి చితకబాదారు.
వివరాల్లోకి వెళితే.. సురేష్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా గుండాల ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. మామిళ్లగూడెం సమీపంలో బాలికపై సోమవారం అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించింది. దీంతో అతడు పరారైయ్యాడు.
ఆ విషయాన్ని సదరు బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులతోపాటు స్థానికులు సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి సురేష్ ఇంటికి రావడంతో వారంతా అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. గతంలోనూ ఎమ్మార్వో సురేష్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో టూటౌన్లో కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు. కాగా, సురేష్పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలంబరిది వెల్లడించారు.
ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర
హైదరాబాద్: బ్యూటీషియన్ ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉద్యోగాలిస్తాం రమ్మని పిలిచి అమ్మాయిలను మోసం చేస్తున్న సయ్యద్ సలీం అనే వ్యక్తిని బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
పత్రికల్లో బ్యూటీషియన్ ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తూ ఇంటర్వ్యూలకు పిలిచి.. ఆఫీసుకు వచ్చిన వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్: విచారణలో ఉన్న రిమాండ్ ఖైదీ గొంతు కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన మంగళవారం గద్వాల్లో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. రాజు అనే పాత నేరస్తుడిని ఓ దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా స్టేషన్ ఆవరణలో ఉన్న బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని కర్నూలులోని ఆస్పత్రి తరలించారు.