ఎన్కౌంటర్లు: ఖమ్మం జిల్లాలో తుపాకీ కలకలం
ఖమ్మం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తుపాకులతో పలువురు కలకలం సృష్టిస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ అడవుల్లో ఓ వ్యక్తి ఏకే 47తో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రాజేశ్వరపురంలో ఓ వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు రాజేశ్వరపురం చేరుకున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు కూసుమంచిపురం వద్ద లారీలో నుంచి తుపాకులతో దిగారని స్థానికులు చెబుతున్నారు. బుధవారం కనిపించిన వ్యక్తి అతడేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇద్దరు వ్యక్తులు లారీ దిగితే బుధవారం ఒక్కడే కనిపించాడా? అని స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తుపాకీ కలిగి ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్కౌంటర్ ఘటనల నేపథ్యంలో మరో ఉగ్రవాది ఇక్కడే సంచరిస్తున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట బస్టాండ్ సీసీ టీవీ ఫుటేజ్లో మరో వ్యక్తి బస్సు దిగి పారిపోయాడని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అతడు కూడా తెలంగాణలోనే సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.