
కేసిఆర్ పథకాలతో నిజమైన పండుగ.!రైతుల ఆనందోత్సాహాల మద్య సంక్రాంతి అంటున్న మంత్రి సత్యవతి.!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణలో రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో వ్యవసాయం పండగ అయి, రైతు రాజు అవుతున్నాడని, రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 50వేల కోట్ల రూపాయలు జమ చేయడంతో రైతులకు పెట్టుబడి బాధలు తప్పి వారి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చి రైతు కుటుంబాల్లో నూతన క్రాంతి చేరిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ బోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలు బోగి మంటల్లో కాల్చాలి..
గత రెండేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు, వైరస్ లను భోగి మంటలలో అగ్ని దేవుడికి ఆహుతి చేసి, రాబోయే కాలంలో సుఖ,సంతోషాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ఈ పండగ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి రోజు తెల్లవారు ఝామున వేసే భోగి మంటలలో ఇంట్లోని పాత వస్తువులను వేసినట్లే...రాష్ట్రంలోని పనికిరాని, ప్రగతి నిరోధక ప్రతిపక్షాలను కూడా భోగి మంటల్లో వేసి కాల్చాలని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగం కావాలని, కొత్తమార్గంలోకి, కొత్త సంవత్సరం లోకి పయనించాలని ఆహ్వానించారు.
రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 50వేల కోట్లు జమ..
సంక్రాంతి అంటే వ్యవసాయం చేసే రైతులు ధాన్యం రాశులు పోసి, కుటుంబమంతా గుంపులుగా చేరి, సంతోషాన్ని పంచుకునే రోజు. గత పాలనలో వ్యవసాయాన్ని దండగ చేసి సంక్రాంతిలో క్రాంతి లేకుండా చేస్తే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలనలో రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్, మానవ నిర్మిత మహా అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు, రైతు బీమా, రైతు బంధు పథకాలు, సమృద్ధిగా ఎరువులు, లాభాదాయక పంటల సాగులో సూచనలు, అనేక సబ్సిడీలు ఇస్తూ రైతుకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతూ తెలుగు రైతుల ఇళ్లకు నిజమైన సంక్రాంతిని తీసుకువచ్చారని తెలిపారు.

వ్యవసాయాన్ని పండగ చేసిన కేసీఆర్..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రైతు పథకం ద్వారా 50వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశారని, లక్ష కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, దాదాపు 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 10,500 కోట్ల రూపాయలను, విద్యుత్ రంగ పునరుద్దరణకు 28వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని,రైతు బీమా కోసం 1450 కోట్ల రూపాయలు ఏటా చెల్లిస్తూ రైతుకు అన్ని విధాలా అండగా నిలుస్తూ సాగు విస్తీర్ణాన్ని 131 లక్షల ఎకరాల నుంచి 204 లక్షల ఎకరాలకు పెంచి, వ్యవసాయం కోసం దాదాపు 2.70 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.

రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటం..
పల్లెలు నిజమైన ప్రగతి కేంద్రాలు కావాలని పల్లె ప్రగతి చేపట్టి, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలనే మాటను నిజం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రయత్నంతో నిజమైన సంక్రాంతి వచ్చిందన్నారు. రైతు బాగు పడడం ఇష్టం లేని కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వారిని రోడ్డు మీదకి లాగిందని, రైతు వ్యతిరేకతతో వాటిని వెనక్కి తీసుకుని నవ్వుల పాలు అయిందన్నారు. అయినా మళ్ళీ ఎరువుల ధరలు పెంచి రైతుల జీవితాల్లో సంక్రాంతి లేకుండా చేస్తుందని, ఈ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి కూడా భోగి మంటల్లో కాలి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతు సంక్షేమ పథకాలు కేంద్రం కూడా అమలు చేసే మంచి ఆలోచన రావాలని ఆకాంక్షించారు.