కూకట్పల్లిలో విషాదం: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన కోతి
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతిని తరిమేందుకు యత్నించి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన లోకేష్(30) గచ్చిబౌలిలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
కూకట్పల్లిలోని జయనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నాడు లోకేష్. కాగా, వీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. కోతుల బెడద తట్టుకోలేక లోకేష్ మంగళవారం ఇంటి తలుపులు మూసివేసి విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, ఇంట్లోకి గాలి రావడం కోసం ఉంచిన రంధ్రం నుంచి కోతి ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో లోకేష్.. కర్టెన్ రాడ్తో కోతిని బెదిరిస్తూ బయటకు వచ్చాడు. ఈ క్రమంలో కోతిని కొట్టబోతుండగా.. పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు అతని చేతిలోని రాడ్ తగలడంతో విద్యుత్ షాక్కి గురయ్యాడు.
లోకేష్ కుప్పకూలిన విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లోకేష్ ప్రాణాలు వదిలాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కొడుకు కళ్లముందే కన్నుమూయడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య ఏడాది కుమారుడు ఉన్నారు. లోకేష్ భార్య రోదనలు మిన్నంటాయి.