కూతురు, భార్యతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య: ప్రేమపెళ్లి, టీసీఎస్లో ఉద్యోగం, ఏమైందోగానీ..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పలు సమస్యలతో కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరువకముందే మరో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే, ఏమైందో తెలియదు కానీ, ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వారి కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... అమీన్పూర్ వందనపురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో సమా దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. షాద్నగర్కు చెందిన శ్రీకాంత్ గౌడ్(42), అల్వాల్కు చెందిన అనామిక(40) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి స్నిగ్ధ అనే ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది.
టీసీఎస్లో ఉద్యోగం.. సాఫీగా కాపురం.. కానీ..
కాగా, శ్రీకాంత్.. టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక, అనామిక స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. వారి కాపురం అంతా సాఫీగా సాగుతోంది. అయితే, గత రెండు రోజుల నుంచి వారు కనిపించలేదు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసినా స్పందనలేదు. దీంతో అతను వందనపురి కాలనీలోని శ్రీకాంత్ నివాసానికి వచ్చి చూడగా.. తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి.
విగత జీవులుగా దంపతులు, ఏడేళ్ల చిన్నారి
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. స్నిగ్ధ, ఆమె తల్లి అనామిక నురగలు కక్కి మంచంపై ఉన్నారు. పక్క గదిలో శ్రీకాంత్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, వారి నుదుటన ఎర్రబొట్లు ఉండటం, దేవుని గదిలో చిత్ర పటాలు బోర్లించి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల కొత్తగూడెం, విజయవాడలో పలు సమస్యలతో రెండు వేర్వేరు ఘటనల్లో రెండు కుటుంబాలు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.