వివాహితపై దుష్ప్రచారం: కాల్ గర్ల్ పేరుతో సోషల్ మీడియాలో.. టెక్కీ అరెస్ట్
హైదరాబాద్: ప్రేమను నిరాకరించిందన్న కారణంతో భౌతిక దాడులకు దిగుతున్నవారు కొంతమందైతే.. ప్రతిష్టను దిగజార్చేలా మానసిక వేధింపులకు గురిచేస్తున్నవారు మరికొందరు. రెండు సందర్భాల్లోను యువతులే ఎక్కువగా నష్టపోతున్నారు.
తాజాగా మరో యువతి కూడా మానసిక వేధింపులకు గురైన ఘటన వెలుగుచూసింది. తన ప్రేమను రిజెక్ట్ చేసి మరో యువకుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో సోషల్ మీడియాలో యువతిపై దుష్ప్రచారం చేశాడో యువకుడు.
చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అతన్ని ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన సందీప్గా గుర్తించారు. మంగళవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
బాధిత యువతి పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసిన సందీప్.. అసభ్యకర సందేశాలు, పోస్టులు పెడుతూ వచ్చాడు. అంతటితో ఆగకుండా యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను సైతం లోకోంటో, ఇతర బ్లాగ్స్ లలో కాల్ గర్ల్ గా పోస్టు చేశాడు.
సోమవారం బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ డేటా, ఐపీ వివరాల ఆధారంగా మంగళవారం ఉదయం నిందితుడు సందీప్ ను అరెస్ట్ చేశారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ లోని కూకట్ పల్లి 16వ కోర్టు ఎదుట హాజరుపరిచిన తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.