200 రూపాయల కోసం తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు .. కొత్తగూడెంలో దారుణం
సమాజంలో రోజు రోజుకి నేరప్రవృత్తి పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా దారుణాలు, హింసాత్మక ఘటనలు అడ్డూ అదుపు లేకుండా చోటుచేసుకుంటున్నాయి. రక్త సంబంధాలను కూడా మరిచి చిన్న చిన్న విషయాలకే దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళనకరంగా మారాయి. తాజాగా కేవలం రెండు వందల రూపాయలు అడిగితే ఇవ్వలేదని తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ తనయుడు.
భద్రాద్రి కొత్తగూడెంలోని బూడిద గడ్డలో దారుణ ఘటన జరిగింది. తండ్రిని కొడుకు అత్యంత అమానుషంగా చంపేశాడు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం 59 సంవత్సరాల వయసున్న గోశిక కొమరయ్య అనే సింగరేణి కార్మికుడు ఇటీవలే రిటైర్ అయ్యారు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్దకొడుకు రవికి 600 రూపాయలు ఇచ్చి కోడిని తెప్పించి వండుకు తింటున్న సమయంలో, కొమరయ్యను చిన్న కొడుకు శివ ప్రసాద్ తనకు రెండు వందల రూపాయలు కావాలని తండ్రిని అడిగాడు. ఎందుకని ప్రశ్నించిన తండ్రికి కొడుకు తాగడానికి అని సమాధానమిచ్చాడు.
మద్యం సేవించడానికి అయితే డబ్బులు ఇవ్వనని కొమరయ్య చెప్పడంతో, తన సోదరుడు అడిగితే డబ్బులు ఇచ్చాడని, తనకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న కొడుకు అందరూ పడుకున్న తర్వాత రోకలిబండతో మోది తండ్రి అన్న కనికరం కూడా లేకుండా కొమరయ్య ప్రాణం తీశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, కొమరయ్య కొడుకు శివప్రసాద్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రెండు వందల రూపాయల కోసం కొమురయ్య ప్రాణం కొడుకు తీశాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు.