'జీతం రాగానే వచ్చేస్తానన్నాడు.. మృతదేహమై ఇంటికి చేరాడు'
చేబ్రోలు : నెల జీతం రాగానే రాజీనామా చేసేసి ఇంటికొచ్చేస్తాన్న ఓ సివిల్ ఇంజనీర్, మృతదేహమై ఇంటికి చేరాడు. మృతికి సంబంధించి కంపెనీ వాళ్లు చెబుతోన్న మాటల్లో నిజం లేదని కుంటుంబ సభ్యులు అంటున్నారు. హత్యాయత్నం జరిగి ఉండొచ్చనేది కుటుంబ సభ్యుల వాదనయితే, వ్యాధి కారణంగానే చనిపోయాడనేది కంపెనీ యాజమాన్యం వాదన. ఇంతకీ ఏది నిజం..?
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం లోయపల్లి ప్రాంతంలో ఓఎన్ సీ ప్రైవేటు లిమిటెడ్ నిర్వహిస్తున్న నిర్మాణ పనుల్లో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు శేకూరుపాలెంకు చెందిన నెమలికంటి సురేశ్ బాబు (37).
ఇదే క్రమంలో గత నెలలో ఇంటికి వచ్చిన సురేశ్ బాబు, కంపెనీలో విధుల గురించి కుటుంబ సభ్యుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కంపెనీ ఎండీ, జీఎం లు తనను వేధిస్తున్నట్టుగా సురేశ్ భార్య దగ్గర వాపోయినట్టు సమాచారం. కంపెనీలో పనిచేయడం కష్టంగా మారిందని భార్యతో ఆవేదన చెందిన సురేశ్,నెల జీతం రాగానే ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇంటికి వస్తానని చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇంతలోనే సురేశ్ మృతి చెందినట్టుగా సదరు కంపెనీ నుంచి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులంతా హుటాహుటిన పరిగెత్తారు. అయితే మృతికి సంబంధించి కంపెనీ వాళ్లు చెబుతోన్న కారణాలు కుటుంబ సభ్యుల్లో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. విధులు నిర్విర్తిస్తోన్న సమయంలో బిల్డింగ్ మెట్లపై నుంచి పడిపోయిన సురేశ్ బాబును ఆసుపత్రి తరలించగా.. 15 వ తేదీన గుండెనొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో సురేశ్ చనిపోయినట్టుగా ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
సురేశ్ బిల్డింగ్ పైనుంచి పడడంతో ముందుగా స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి, ఆ తర్వాత వరంగల్ ఆసుపత్రికి సురేశ్ ను తరలించినట్టు కంపెనీ చెబుతోంది. కాగా, 16వ తేదీన మృతదేహాన్ని తీసుకున్న సురేశ్ కుటుంబ సభ్యులు, 17వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు.
మృతదేహంపై పలు గాయాలు ఉండడం, శరీరం నల్లగా మారిపోయి ఉండడంతో సురేశ్ పై విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇదే విషయమై సురేశ్ భార్య నెమలికంటి చిన్ని వరంగల్ పోలీసు ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో నిజానిజాలను నిర్ధారించే పనిలో పడింది పోలీస్ యంత్రాంగం.