వెయ్యి కిలో మీటర్ల నడక.!భారీ సభ.!వైయస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం.!
హైదరాబాద్: స్వల్ప విరామం అనంతరం శనివారం నుంచి వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిళ ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం కాబోతుంది. ఖమ్మంజిల్లా సత్తుపల్లి నుంచే తిరిగి 77వ రోజు పాదయాత్రను మొదలు పెట్టాలని వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 6న సత్తుపల్లి వద్ద వాయిదా పడిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర అదే సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద వెయ్యి కిలో మీటర్లు పూర్తి చేసుకుంటున్నారు షర్మిల. ఈ సందర్బంగా తాళ్లమడ గ్రామంలో వెయ్యి కిలో మీటర్ల పైలాన్ వద్ద నుంచి శనివారం పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నారు షర్మిళ. శనివారం సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ కూడా నిర్వహించబతున్నారు. సభ అనంతరం తాళ్లమడ గ్రామం మీదుగా, సత్తుపల్లి టౌన్, గౌరిగూడెం, సిద్దారం మీదుగా పాదయాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది.
తెలంగాణలో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర స్వల్పవిరామం అనంతరం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 10గంటలకు రోడ్డు మార్గం ద్వార పార్టీ అధ్యక్షురాలు షర్మిళ సత్తుపల్లికి బయలు దేరతారు. సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాదయాత్ర 1000 కి.మీ మైల్ స్టోన్ దాటినందుకు గుర్తుగా నిర్మించిన పైలాన్ నుంచే తమ అడుగు వేయబోతున్నారు.ముందుగా తాళ్లమడ వెయ్యి కిలో మీటర్ల పైలాన్ వద్ద బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. పునఃప్రారంభం అవుతున్న ప్రజాప్రస్థాన పాదయాత్రకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని లోటస్ పాండ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేపు రాత్రికి వైఎస్ షర్మిల సిద్దారం గ్రామంలోనే బస చేయనున్నారు.