చైనా నుండి వచ్చి కారెక్కి కూర్చుందట.!సోషల్ మీడియాలో గులాబీ పార్టీ గురించి గమ్మత్తైన ప్రచారం.!
హైదరాబాద్ : గత మూడు నాలుగు రోజుల నుండి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గురించి ఓ చిత్రమైన ప్రచారం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా ఆ సమాచారాన్ని అటు మార్చి, ఇటు మార్చి, కాస్త మసాలా దట్టించి, కాస్త డోస్ పెంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరూ మాంచి మజాగా ఆ వార్తను ఆస్వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార గులాబీ పార్టీలో చేరిపోయి ప్రజాప్రతినిధులందరితో "అది" కలిసిపోతోందనే ఆసక్తికర పోస్టులు కూడా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యక్ష్యమవుతున్నాయి.
వింత వార్త.. విచిత్ర ప్రచారం.. ప్రజల స్మార్ట్ ఫోన్లలో ప్రత్యక్షమవుతున్న గమ్మత్తైన వార్త..
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తాన్ని ఈ వార్త షేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికార గులాబీ పార్టీ అత్యంత బలోపేతంగా ఉండడం, ఇతర పార్టీల నేతలు చాలా వరకు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు సాహసోపేత సీఎంగా గుర్తింపు వచ్చింది. ఎదుటి పార్టీలపై పైచేయి సాధించాలన్నా, ఎన్నికల్లో గెలవాలన్నా, విపక్ష పార్టీలను బలహీన పరచాలన్నా చంద్రశేఖర్ రావు తర్వాతే ఎవరన్నా అనేంత ఖ్యాతిని పొందారు సీఎం చంద్రశేఖర్ రావు.
తెలంగాణ ప్రజాప్రతినిధులకు కరోనా.. అందుకే తెరమీదకు వచ్చిన వింత ప్రచారం..
ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఎదురులేని పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని, ఎంతటి వారైనా ఆ పార్టీలో చేరేందకు తహతహలాడుతుంటారని, ఆ క్రెడిబులిటీ మొత్తం చంద్రశేఖర్ రావుకే దక్కుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటే అధికార పార్టీకి ఎప్పటికైనా ప్రమాదకరంగా పరిణమించొచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులను కూడా బాగానే ప్రోత్సహించారు. వివిధ పార్టీలనుండి చాలా మంది ముఖ్య నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త.. ఎంజాయ్ చేస్తున్న జనాలు..
వివిధ కారణాలతో ఇతర పార్టీల నాయకులు గులాబీ పార్టీలోకి వెళ్లిపోయారు. అందుకు చంద్రశేఖర్ రావు తెలంగాణ అభివృద్దిని చూసి, తెలంగాణ ప్రజల ఐక్యతను చూసి ఇతర పార్టీల నేతలు గులాబీ పార్టీలో చేరుతున్నారని చంద్రశేఖర్ రావు అంటుంటారు. ఇపుడు అదే కామెంట్ తో జనం టీఆర్ఎస్ ను ఫన్నీగా చిత్రీకరిస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, గణేష్ గుప్తా, వీరంతా కరోనా సోకిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ద్వారానే ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా సోకిందనే అపోహ కూడా జనాల్లో నానుతోంది. కేవలం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే కరోనా సోకడంతో టీఆర్ఎస్ గురించి ఒక కామెంట్ సోషల్ మీడియా వేదికగా బాగా ప్రచారం పొందుతోంది.
టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన కరోనా.. స్మార్ట్ ఫోన్లలో సర్క్యులేట్ అవుతున్న తాజా వార్త..
అందేంటంటే వివిధ వార్తా ఛానళ్లలో వచ్చే బ్రేకింగ్ న్యూస్ ప్లేట్స్ ను కట్ చేసి వాటి మీద అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన కరోనా, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి కరోనా గులాబీ పార్టీలో చేరినట్లు ప్రకటన అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఎక్కడో చైనాలో పురుగుపోసుకున్న కరోనా ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అదికార పార్టీలో తిష్టవేసకుని కూర్చుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో రోజురోజుకు రోనా ఉగ్రరూపం దాల్చడమే కాకుండా అత్యంత భద్రతావలయాల మధ్య ఉండే ప్రజాప్రతినిధుల వరకూ విస్తరిస్తోంది. అందుకే అదికార గులాబీ పార్టీలో చేరిపోయిన కరోనా అనే వార్త హల్ చల్ చేస్తోంది.